అసోంలో వరద బీభత్సం.. చిక్కుకున్న రెండు రైళ్లు

అసోంలో వరద బీభత్సం.. చిక్కుకున్న రెండు రైళ్లు
  • ఈదురుగాలులతో కూడిన వర్షాలు
  • నీటమునిగిన 222 గ్రామాలు
  • వరదల్లో చిక్కుకున్న 57 వేల మంది
  • ముగ్గురు మృతి

భారీ వర్షాలతో అసోం అతలాకుతలం అవుతోంది. ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. దీంతో 222 గ్రామాలు నీటమునిగాయి. అసోంలో 57 వేల మందికిపైగా వరదల్లో చిక్కుకున్నారు. ముగ్గురు చనిపోయారు. దిమా హసావో జిల్లాలో మూడ్రోజులుగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడ్డాయి. అక్కడ 12 గ్రామాల్లో కొండచరియలు విరిగి పడ్డాయి. హఫ్లాంగ్- దేహంగీ, న్యూ హఫ్లాంగ్-జోరై-మిచిదుయ్ ప్రాంతాల్లో ముగ్గురు చనిపోయారు. 80 ఇళ్లు దెబ్బతిన్నాయి. పలు ప్రాంతాల్లో రోడ్లుకొట్టుకుపోయాయి. వర్షాలతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భద్రతా సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. 
భారీ వర్షాలకు రైలు ట్రాకులు కొట్టుకపోయాయి. దీంతో పలు రైళ్లను రద్దు చేసింది అక్కడి రైల్వే శాఖ.

అయితే.. అప్పటికే బయలుదేరిన రెండు రైళ్లు వరదల్లో చిక్కుకున్నాయి. అందులో ఉన్న ప్రయాణీకులు తీవ్ర భయాందోనలకు గురయ్యారు. వారిని రక్షించేందుకు ఎయిర్ ఫోర్స్ రంగంలోకి దిగింది. డిటోక్ చెర్రా స్టేషన్ లో చిక్కుకున్న 1, 245 మందిని బదార్ పూర్, సిల్చర్ రైల్వే స్టేషన్ లకు తరలించారు. మరో 119 మందిని సిల్చర్ కు తరలించింది. వారికి కావాల్సిన సౌకర్యాలను అధికారులు కల్పిస్తున్నారు. మైబాంగ్, మహూర్ మధ్య కొండచరియలు విరిగిపడటంతో.... కొన్ని గంటల పాటు రైల్వే సేవలు నిలిచిపోయాయి. దెబ్బతిన్న ట్రాక్ లను సరిచేసేందుకు రైల్వే బృందాలు చర్యలు తీసుకున్నాయి.

వందల గ్రామాలు నీటిలో చిక్కుకపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ చూసినా నీరే కనబడడంతో బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఇండ్లు, కరెంటు స్తంభాలు, చెట్లు నేలకూలాయి. పలు ప్రాంతాల్లో అంధకారం నెలకొంది. దాదాపు 57 మంది ప్రజలపై ఈ వరదల ప్రభావం పడిందని అంచనా. రోడ్లు, బ్రిడ్జీలు, కాల్వలు పూర్తిగా దెబ్బతిన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ఆర్మీ, పారామిలటరీ దళాలు, ఎన్డీఆర్ఎఫ్ (NDRF), అత్యవసరసేవల సిబ్బంది రంగంలోకి దిగారు. సహాయక చర్యలు ముమ్మరం చేపట్టారు. వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 

కాచర్, ధెమాజి, హొజాయ్, కర్బి అంగ్లాంగ్ వేస్ట్, నాగౌన్, కంరూప్ జిల్లాల్లో వరదలు పోటెత్తాయని తెలిపింది డిజాస్టర్ మేనేజ్ మెంట్. డిమా హసావోను కాచార్ జిల్లా సిల్చార్ తో కలిపే నేషనల్ హైవే 27 మూసివేసినట్లు తెలిపారు స్థానిక అధికారులు. అనేక ప్రాంతాల్లో కొండల నుంచి మట్టి, రాళ్ల భాగాలు పడిపోయాయి. వాటిని క్లియర్ చేస్తున్నారు అధికారులు. రోడ్లపై మట్టి, చెత్తా చెదారాన్ని తొలగించే పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఇవాళ కూడా భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపారు అధికారులు. అసోం వరదలపై కేంద్రం సమీక్షించింది. రాష్ట్రానికి తక్షణ సాయంగా 125 కోట్లను విడుదల చేసింది. వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ అధికారుతో రివ్యూ చేశారు.

మరిన్ని వార్తల కోసం : 

రాజస్థాన్ శివాలయంలో రాహుల్ ప్రత్యేక పూజలు

దివ్యాంగుల కోసం సెన్సరీ పార్క్