- టికెట్లకు క్యూ కడుతున్న జనం
- ఫ్లైట్ల సంఖ్యను పెంచిన ఫారిన్ ఎయిర్లైన్స్
న్యూఢిల్లీ: రెండేళ్ల తరువాత ఇంటర్నేషనల్ ఫ్లైట్లు మొదలుకావడంతో జనం ఫారిన్ వెళ్లడానికి ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. ఫారిన్ టూర్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ఇంటర్నేషనల్ ట్రావెల్పై అన్ని రకాల రిస్ట్రిక్షన్లు ఎత్తేయడంతో బుకింగ్స్పెరుగుతున్నాయని ఇండిగో సీఈఓ విలియన్ బాల్టర్ చెప్పారు. అన్ని చోట్లకూ బుకింగ్స్ బాగున్నాయని, టూరిజం సెక్టార్కు, ఎకానమీకి ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. ఇండియాకు నడిపే అన్ని ఫ్లైట్ సర్వీసులను మొదలుపెట్టామని, బుకింగ్స్ బాగున్నాయని ఎమిరేట్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ మహ్మద్ సర్హాన్ చెప్పారు. ఎండాకాలం చాలా మంది ఫారిన్ వెళ్తారు కాబట్టి తమ ఇండియాకు ఫ్లైట్లను పెంచామని ఎయిర్ఫ్రాన్స్– కేఎల్ఎం, వర్జిన్ అట్లాంటిక్ తెలిపాయి. ఎయిర్ఫ్రాన్స్ వచ్చే నెల నుంచి వారానికి 20 వీక్లీ ఫ్లైట్ సర్వీస్లను, మే నెల నుంచి 30 వీక్లీ ఫ్లైట్ సర్వీస్లను నడపనుంది. జూన్ నుంచి వర్జిన్ అట్లాంటిక్ లండన్–ఢిల్లీ సర్వీసును మొదలుపెడుతోంది. ఇండియాకు ఇది మూడు సర్వీసులను నడుపుతోంది. ఇండియాకు చెందిన ఆరింటితోపాటు 40 దేశాలకు చెందిన 60 ఫారిన్ ఎయిర్లైన్స్ మనదేశం నుంచి 3,249 వీక్లీ ఫ్లైట్లను నడుపుతాయని కేంద్రం ప్రకటించింది. ఇండిగో అత్యధికంగా 505 వీక్లీ ఫ్లైట్లను నడుపుతుంది. 150 కిపైగా రూట్లలో తమ విమానాలు తిరుగుతాయని తెలిపింది. టాటా గ్రూపుకు చెందిన ఎయిర్ ఇండియా వారానికి 361 ఫ్లైట్లను, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ 340 ఫ్లైట్లను నడుపుతాయి. ఎమిరేట్స్ వారానికి 170 ఫ్లైట్లను నడుపుతుంది. శ్రీలంక ఎయిర్లైన్స్ (128), ఒమన్ ఎయిర్ (115), ఎయిర్ అరేబియా (110), ఖతార్ ఎయిర్వేస్ (99), గల్ఫ్ ఎయిర్ (82), ఎతిహాద్ (80), ఎయిర్ ఏషియా బెర్హాద్ (71), కువైట్ ఎయిర్వేస్ 56 ఫ్లైట్లను నడుపుతాయి. మొత్తం 27 దేశాల్లోని 43 సిటీలకు ఫ్లైట్లను నడపడానికి డీజీసీఏ నుంచి ఇండియా ఎయిర్లైన్ కంపెనీలకు అనుమతులు వచ్చాయి. వీటిలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, సింగపూర్, థాయిలాండ్, శ్రీలంక, ఖతార్, మాల్దీవులు, ఒమన్, సౌదీ అరేబియా, నేపాల్, బంగ్లాదేశ్, టర్కీ, మలేషియా, యునైటెడ్ కింగ్డమ్ (యూకే), ఫ్రాన్స్, కెన్యా, జర్మనీ, అమెరికా, కెనడా, మయన్మార్, ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్, బహ్రెయిన్ , దక్షిణ కొరియా, జపాన్, హాంకాంగ్, రష్యా ఉన్నాయి. మనదేశం నుంచి 2019లో ఫారిన్ ట్రావెలర్ల సంఖ్య ఆరు కోట్లు కాగా, కరోనా వల్ల గత రెండేళ్లలో వీరి సంఖ్య భారీగా తగ్గింది. కేవలం ఎయిర్బబుల్ అగ్రిమెంట్లు ఉన్న దేశాలకు మాత్రమే విమానాలు నడిచాయి.
లగ్జరీకి రెడీ
ఫారెన్ ట్రావెలర్స్లో చాలా మంది లగ్జరీవైపు మొగ్గుచూపుతున్నారు. గతంలోకంటే ఫైవ్స్టార్ హోటల్స్లో ఉండటం, బిజినెస్ క్లాస్ ప్రయాణాలు, రిసార్టుల బుకింగ్స్ పెరిగాయి. మనవాళ్లు ప్రయాణాలపై చేసే ఖర్చు చాలా పెరిగిందని ఈజ్మైట్రిప్ ఫౌండర్ ప్రశాంత్ పిట్టి అన్నారు. ప్రీ-పాండమిక్ నంబర్లతో పోలిస్తే విమానాలు ఫైవ్ స్టార్ హోటళ్లలో బిజినెస్ క్లాస్ సీట్ల బుకింగ్లు ఇప్పటికే రెట్టింపు అయ్యాయని అన్నారు. కోవిడ్కి ముందు భారతీయుల హాలిడేల సగటు 3.2 రోజులు కాగా, ఇప్పుడు సగటున 4.7 రోజుల సెలవులను ప్లాన్ చేసుకుంటున్నారని చెప్పారు. ఏటీఎఫ్ ధరలు ఎక్కువ కావడంతో ఎయిర్లైన్స్ టికెట్ల రేట్లను పెంచాయి. అయినప్పటికీ డిమాండ్ తగ్గే అవకాశాలు కనిపించడం లేదని పిట్టి చెప్పారు. ఏవియేషన్ సెక్టార్ వేగంగా పుంజుకుంటోందని వివరించారు.
