‘అగ్నిపథ్’ స్కీమ్ లో భాగంగా వాయుసేనలో నియామకాల కోసం శుక్రవారం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే గత మూడు రోజుల్లోనే ఏకంగా 59,960 మంది అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించారు. జూలై 5 వరకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది. లక్షల్లో దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎయిర్ ఫోర్స్ లో ‘అగ్నివీర్’ తొలి బ్యాచ్ ను డిసెంబరు 11న ప్రకటించనున్నారు. కాగా, అగ్నిపథ్ పథకాన్ని కేంద్రం ఈ నెల 14న ప్రకటించింది. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. నాలుగేళ్ల సర్వీసు కాలం తర్వాత 75 శాతం మంది అగ్నివీర్లు.. పెన్షన్ ప్రయోజనాలు లేకుండా పదవీ విరమణ చేయాలనే నిబంధనపై నిరసనకారులు గళమెత్తుతున్నారు. అయినా అగ్నిపథ్ పై వెనక్కి తగ్గేది లేదని కేంద్రం తేల్చి చెబుతోంది.
