ఎన్జీటీ ఎదుట ఏపీ బుకాయింపు
ప్రాజెక్టు సైట్లో టెస్టింగ్ కోసమే బ్లాస్టింగ్స్ చేస్తున్నామని వివరణ
ట్రిబ్యునల్ టైమిచ్చినా అఫిడవిట్ ఫైల్ చేయని ఏపీ
ఇంకా గడువు కావాలని విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: శ్రీశైలం బ్యాక్వాటర్లో సంగమేశ్వరం లిఫ్ట్ స్కీం పనులు మొదలుపెట్టేసిన ఏపీ.. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ముందు మాత్రం అలాంటిదేమీ లేదని బుకాయించింది. ప్రాజెక్టు పనులు చేయట్లేదని, వర్క్ సైట్లో టెస్టింగ్ కోసం బ్లాస్టింగ్స్ చేస్తున్నామని చెప్పుకొచ్చింది. వివరణ సరిగా ఇవ్వకుండా, అఫిడవిట్ కూడా సమర్పించకుండా.. మరింత గడువు కావాలని ఎన్జీటీని కోరింది.
ఏపీ సర్కారు ఎన్జీటీ ఆదేశాలను ధిక్కరించి సంగమేశ్వరం (రాయలసీమ) లిఫ్ట్ స్కీం పనులు చేపడుతోందంటూ నారాయణపేట జిల్లాకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్పై సోమవారం ఎన్జీటీ చెన్నై బెంచ్ జ్యుడీషియల్ మెంబర్ జస్టిస్ రామకృష్ణన్, ఎక్స్పర్ట్ మెంబర్ సైబల్ దాస్ గుప్తా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపారు. పిటిషనర్ తరఫున సుప్రీంకోర్టు అడ్వొకేట్ శ్రవణ్కుమార్ వాదనలు వినిపిస్తూ.. ఏపీ ప్రభుత్వం సంగమేశ్వరం లిఫ్ట్ పనులు కొనసాగిస్తోందని ఎన్జీటీకి వివరించారు. ఎలాంటి పర్మిషన్లు లేకుండానే బ్లాస్టింగ్స్ చేస్తోందని, ఎన్విరాన్మెంట్ రూల్స్ను ఉల్లంఘిస్తోందని తెలిపారు. దీనిపై స్పందించిన ఎక్స్పర్ట్ మెంబర్ సైబల్ దాస్ గుప్తా.. బ్లాస్టింగ్స్ ఎందుకు చేస్తున్నారని ఏపీ అడ్వొకేట్ వెంకటరమణిని ప్రశ్నించారు.
దీనిపై ఏపీ అడ్వొకేట్ స్పందిస్తూ.. డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) తయారు చేయడం కోసమే వర్క్ ప్లేస్లో బ్లాస్టింగ్స్ చేస్తున్నామని చెప్పారు. ప్రాజెక్టుకు అవసరమైన టెస్టులు చేయడం మినహా నిర్మాణ పనులేం చేయడం లేదన్నారు. దీనిపై పిటిషనర్ అడ్వొకేట్ అభ్యంతరం తెలిపారు. పేపర్లపై రూపొందించే డీపీఆర్ కోసం బ్లాస్టింగ్స్ చేయాల్సిన అవసరమేంటని నిలదీశారు. ప్రాజెక్టు నిర్మాణ పనులు చేస్తూ ఎన్జీటీకి వివరణ ఇవ్వకపోవడం సరికాదన్నారు. అఫిడవిట్ ఫైల్ చేయడానికి ఏపీకి ఎన్జీటీ గడువు ఇచ్చినా ఇంకా ఫైల్ చేయలేదని చెప్పారు. దీనిపై ఏపీ అడ్వొకేట్ వివరణ ఇస్తూ.. ప్రభుత్వ వివరణ రెడీ చేస్తున్నామని, త్వరలోనే ఫైల్ చేస్తామని, కొంత గడువు ఇవ్వాలని కోరారు. దీంతో కేసు విచారణను వచ్చే నెల రెండో తేదీకి వాయిదా వేస్తున్నామని, ఆలోగా అఫిడవిట్ ఫైల్ చేయాలని ఎన్జీటీ జ్యుడీషియల్ మెంబర్ రామకృష్ణన్ ప్రకటించారు. ఏపీ ప్రభుత్వం సమాధానం సంతృప్తికరంగా లేకుంటే.. పనులు ఆపాలని ఆదేశిస్తామని స్పష్టం చేశారు.
డీపీఆర్పై ఒక్కోచోట ఒక్కోతీరుగా..
సంగమేశ్వరం డీపీఆర్పై ఏపీ సర్కారు ఒక్కోచోట ఒక్కోతీరుగా జవాబు చెప్తోంది. పాత ప్రాజెక్టుల ఆయకట్టుకు నీళ్లు ఇవ్వడానికే కొత్త లిఫ్ట్ స్కీం చేపట్టామని, కాబట్టి డీపీఆర్ ఇవ్వాల్సిన అవసరం లేదని కేంద్ర జలశక్తి శాఖకు చెప్పింది. కృష్ణాబోర్డు మెంబర్ సెక్రటరీకి ఇదే సమాధానమిచ్చింది. పాత ప్రాజెక్టులకు సప్లిమెంట్ చేయడానికి చేపట్టిన లిఫ్ట్ కాబట్టి.. డీటైల్డ్ ప్రాజెక్టు ఇన్ఫర్మేషనే ఇచ్చామని ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి మీడియాకు కూడా తెలిపారు. డీపీఆర్ కచ్చితంగా ఇచ్చి తీరాల్సిందేనని కేంద్రం చాలాసార్లు లెటర్లు రాసినా.. ఏపీ ఇదే మాట చెప్తూ వస్తోంది. డీపీఆర్ ఇవ్వబోమంటూనే.. ఇప్పుడేమో బ్లాస్టింగ్స్ చేస్తున్నది డీపీఆర్ తయారీకేనని ఎన్జీటీకి చెప్పుకొచ్చింది. ఇట్లా ఒక్కో చోట ఒక్కో మాట చెప్తూ తప్పించుకోవాలని ప్రయత్నిస్తోందని తెలంగాణ ఇంజనీర్లు మండిపడుతున్నారు.
