అసెంబ్లీ చేసిన చట్టాలను , మండలి నిబంధనలను పట్టించుకోకుండా టీడీపీ అడ్డుకుంటుందని ఆరోపించారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ. రాజకీయ లబ్ది కోసం టీడీపీ నేతలు శాసన మండలిని అవహేళన చేస్తున్నారని విమర్శించారు. గతంలో ఎన్టీఆర్ మండలి రద్దు సమయంలో మద్దతు తెలిపిన కొంతమంది ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. రూల్స్ ను అతిక్రమిస్తూ వికేంద్రీకరణ బిల్లు సెలెక్ట్ కమిటీకి పంపారని చెప్పారు. చంద్రబాబులా తమకు ఎమ్మెల్సీలను కొనాల్సిన అవసరం లేదన్నారు .
రాజ్యాంగానికి తూట్లు పొడవడంపై సీఎం జగన్ ఆవేదన చెందారన్న బొత్స… ప్రభుత్వంపై లేనిపోనివన్నీ ఆపాదిస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని టీడీపీని విమర్శించారు. మండలి ఛైర్మన్ టీడీపీ కార్యకర్తలా పని చేస్తున్నారన్నారు. రాజ్యాంగ పరిరక్షణపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదన్నారు. చంద్రబాబుకు ప్రజల శ్రేయస్సు కన్నా రాజకీయాలే ముఖ్యమన్నారు. మండలి రద్దయితే లోకేష్కు పదవి పోతుందనేది చంద్రబాబుకు భయం పట్టుకుందని, ఎందుకంటే ప్రత్యక్ష ఎన్నికల్లో లోకేష్ గెలవలేడన్నారు. రేపు మండలి రద్దుపై ప్రభుత్వం నిర్ణయం తెలుస్తుందన్నారు. మండలి రద్దు మాకెలాంటి నష్టం ఉండదన్నారు.

