జర్నలిస్టులకు ఏపీ సీఎం జగన్ తీపి కబురు చెప్పారు. గత మంత్రివర్గ సమావేశంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు ఏపీ మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. దీనికి అనుగుణంగా ఏపీ ప్రభుత్వం జీవో 395 విడుదలచేసి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీలో ప్రతీ జర్నలిస్టుకు 3 సెంట్ల ఇళ్ల స్థలం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 60:40 శాతం చెల్లింపు పద్దతిలో ఇళ్ల స్థల కేటాయింపు ఉంటుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. కనీసం 5 ఏళ్లు అక్రిడేషన్ కలిగిన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పంపిణీ వర్తించనుంది. జిల్లా ఇంచార్జ్ మంత్రి నేతృత్వంలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపునకు కమిటీలు ఏర్పాటు చెయ్యాలని నిర్ణయించింది ప్రభుత్వం. అయితే ఆ కమిటీలో జర్నలిస్టులకు సభ్యులుగా అవకాశం కల్పించనుంది .ఇళ్ల స్థలాల కోసం జర్నలిస్టులు ఆన్ లైన్లో దరఖాస్తులు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేక వెబ్ సైట్ను రూపొందించి.. 45 రోజుల్లోగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది