ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. డిసెంబర్ 8వ తేదీ శుక్రవారం ఏపీపీఎస్సీ గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేసింది. వచ్చే ఏడాది మార్చి 17వ తేదీన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. 2024, జనవరి 1వ తేదీ నుంచి 21వ తేదీ వరకూ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఆబ్జెక్టివ్ విధానంలో గ్రూప్-1 పరీక్ష ఉంటుంది. ఆఫ్లైన్ లోనే ఈ పరీక్ష నిర్వహిస్తారు. డిస్క్రిప్టివ్ విధానంలో నిర్వహించబోయే మెయిన్ పరీక్ష తేదీని ఏపీపీఎస్సీ ఖరారు చేయలేదు. ఈ పరీక్ష ద్వారా మొత్తం 81 పోస్టులను ఏపీపీఎస్సీ భర్తీ చేయనుంది.
పోస్టుల వివరాలు:
ఏపీ సివిల్ సర్వీస్ (ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్) డిప్యూటీ కలెక్టర్ పోస్టులు 9, ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ 18, డీఎస్పీ (సివిల్) 26, రీజనల్ ట్రాన్స్పోర్టు ఆఫీసర్ 6, కోఆపరేటివ్ సర్వీసెస్లో డిప్యూటీ రిజిస్ట్రార్ పోస్టులు 5, జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ 4, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి 3, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్/అసిస్టెంట్ అకౌంట్స్ అధికారి పోస్టులు 3, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ 2, జైళ్ళ శాఖలో డిప్యూటీ సూపరింటెండెంట్, జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ II, అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పోస్టులు ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. ఈ నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి వివరాలను ఏపీపీఎస్సీ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు.