32,152 కి.మీ రోడ్ల నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం

32,152 కి.మీ రోడ్ల నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం కోసం అమలుచేస్తున్న పథకాన్ని 2023 వరకు పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 2016 నుంచి 9 రాష్ట్రాల్లోని 44 జిల్లాల్లో 105 బ్రిడ్జిలతో పాటు 4,490 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం జరిగిందన్నారు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్. 5,714 కిలోమీటర్ల రోడ్లు, 358 బ్రిడ్జిలు పెండింగ్ లో ఉన్నాయన్నారు. వీటికి అదనంగా 1,887 కిలోమీటర్ల రోడ్లు, 40 బ్రిడ్జిల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని చెప్పారు.దేశంలోని సుదూర ప్రాంతాల్లో రూ.33,822 కోట్లతో 32,152 కి.మీ రోడ్ల నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు.

అలాగే.. మొబైల్ నెట్ వర్క్ అందని ప్రాంతాలకు 4జీ సర్వీసులు అందించే స్కీమ్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్, చత్తీస్ గఢ్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశాలో ఈ స్కీంను అమలు చేయనున్నారు. దీని ద్వారా 44 జిల్లాల్లో 7 వేల గ్రామాలకు 4జీ మొబైల్ సర్వీసులు అందించనున్నారు.ఈ  ప్రాజెక్ట్ విలువ రూ.6,466 కోట్లుగా అంచనా వేశామన్నారు.