అగస్టావెస్ట్ లాండ్ కేసులో మధ్యవర్తి క్రిస్టియన్ మిచెల్తో పాటు మరో 15 మందిపై సిబిఐ అనుబంధ చార్జిషీట్ దాఖలు చేసింది. అగస్టా వెస్ట్ లాండ్లో పెట్టుబడులు పెట్టేందుకు అధికారులను ఏ విధంగా ప్రభావితం చేశారన్న అంశాన్ని, అలాగే గతేడాది జనవరిలో దుబాయ్ నుండి భారత్కు వచ్చిన సమయంలో నగదును ప్రభుత్వ అధికారులకు బదిలీ చేసిన విషయాన్ని చార్జిషీట్లో తెలిపింది. క్రిస్టియన్ మిచెల్ ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. అయితే ఈ కేసులో మాజీ సిఎజి శశికాంత్ శర్మపై విచారణ జరిపేందుకు రక్షణ శాఖ నుండి అనుమతులు రాకపోవడంతో అతని పేరు దాఖలు చేయలేదని సిబిఐ తెలిపింది. శర్మ, మజీ ఎయిర్ వేస్ మార్షల్ జబ్బర్ సింగ్ పనేసర్లను విచారించేందుకు అనుమతించాల్సిందిగా గతవారం రక్షణశాఖను కోరినట్లు సీబీఐ తెలిపింది. వీటికి సంబంధించి బ్రిటన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ , మారిటిస్, ఇటలీ, టున్సియాల నుండి సాక్ష్యాలను సేకరించినట్లు తెలిపింది. ఈ చార్జిషీట్లో రాజకీయ నేతల పాత్ర లేదని తెలిపింది. 2007లో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో రాష్ట్రపతి, ప్రధాని, ఇతర ప్రముఖుల కోసం 12 హెలికాఫ్టర్లను కొనుగోలు చేసేందుకు రూ. 3,600 కోట్లతో అగస్టావెస్ట్ లాండ్తో అగ్రిమెంట్ చేసుకుంది. అయితే ఆరేళ్ల తర్వాత ఒప్పందం ముగియడంతో అగస్టావెస్ట్ లాండ్ ప్రభుత్వానికి రూ.362 కోట్లు తిరిగి చెల్లించింది. ఆ సమయంలో రక్షణ శాఖ సంయుక్త కార్యదర్శిగా ఉన్న శర్మ ఈ ఒప్పందంలో కీలక పాత్ర పోషించారు.
