విజయవాడ: ఆంధ్ర్రప్రదేశ్ దేవాదాయశాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాల కోసం వారం రోజులపాటు అక్కడే ఉన్న మంత్రి కరోనా టెస్టులు జరిపించుకోగా పాజిటివ్ వచ్చినట్లు తేలింది. తిరుమల బ్రహ్మోత్సవాల్లో పట్టువస్త్రాలు సమర్పించేందుకు వచ్చిన సీఎం జగన్ కు పక్కనే ఉండి అన్ని కార్యక్రమాలను మంత్రి వెల్లంపల్లి జరిపించారు. వివాదాల నేపధ్యంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా వారం పాటు తిరుమలలోనే మకాం వేశారు. బ్రహ్మోత్సవాలు ముగిసే వరకు తిరుమలలోనే ఉన్నమంత్రి ఈ నెల 25వ తేదీన విజయవాడ చేరుకున్నారు. వారం పాటు బయట ఉండి రావడంతో ముందు జాగ్రత్తగా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు జరిపించుకోగా.. స్వల్పంగా కోవిడ్ లక్షణాలతో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో మంత్రి వెల్లంపల్లి ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స చేయించుకుంటున్నారు.

