అమరావతి, వెలుగు: రాజధాని ప్రాంత రైతుల ఆందోళనల నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్తో భేటీ అయ్యారు. గురువారం విజయవాడలోని రాజ్ భవన్కు సతీసమేతంగా వెళ్లిన జగన్ గవర్నర్ దంపతులకు న్యూ ఇయర్ విషెస్ చెప్పారు. గవర్నర్తో గంటపాటు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాజధాని తరలింపుపై రైతులు చేస్తున్న ఆందోళనలపై గవర్నర్ తో చర్చించినట్లు తెలుస్తోంది. అమరావతిలో టీడీపీ నేతలు ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడ్డారని వివరించినట్లు సమాచారం. ఇన్ సైడర్ ట్రేడింగ్పై కేబినెట్సబ్ కమిటీ ఇచ్చిన రిపోర్టను గవర్నర్కు జగన్ అందజేశారు. 3 రాజధానుల ఏర్పాటు, గత ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ మేరకు అమరావతిని ఏ తరహాలో అభివృద్ధి చేస్తామన్న అంశంపై గవర్నర్కు చెప్పినట్లు తెలుస్తోంది. రాజధానిపై ప్రభుత్వం నియమించిన బోస్టన్ కమిటీ నివేదిక అందగానే హైపవర్ కమిటీ రాష్ర్టంలో అభివృద్ధి వికేంద్రీకరణపై నిర్ణయం తీసుకుంటుందని సీఎం జగన్ పేర్కొన్నట్లు తెలిసింది. కమిటీ నిర్ణయంపై ఈ నెల 8న జరిగే కేబినేట్సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని గవర్నర్కు జగన్ చెప్పినట్లు సమాచారం.
ఏసీబీ ఆఫీసర్లకు జగన్ క్లాస్
అవినీతి నిర్మూలన కోసం పనిచేసే మీరే ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా అంటూ యాంటీ కరప్షన్ బ్యూరో (ఏసీబీ) ఆఫీసర్లు ఏపీ సీఎం జగన్ క్లాస్ తీసుకున్నారు. గురువారం ఏసీబీపై ఆయన రివ్యూ చేశారు. ఏసీబీ అధికారుల అలసత్వం వల్లే ప్రభుత్వ ఆఫీసుల్లో లంచం అనే జాడ్యం ముదరడానికి ముఖ్య కారణమని మండిపడ్డారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రభుత్వం ఎన్ని సంక్షేమ పథకాలు తెచ్చినా వేస్ట్ అవుతుందని ఇకనైనా మారాలని సూచించారు. మూడు నెలల్లో మార్పు కనిపించాలని డెడ్ లైన్ పెట్టారు. సిబ్బంది కొరత ఉంటే వెంటనే ఆపాయింట్చేసుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 14400 కాల్ సెంటర్ తో మంచి ఫలితాలు రాబట్టాలన్నారు. ఎమ్మార్వో, రిజిస్ట్రేషన్, టౌన్ ప్లానింగ్ ఆఫీసుల్లో గట్టి నిఘా ఉంచాలని, ప్రభుత్వ అధికారులు లంచం తీసుకోవాలంటే భయపడే పరిస్థితి తేవాలని సూచించారు.
