మత రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం

మత రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం
  • అందుకే 4% ముస్లిం రిజర్వేషన్లు తొలగించాం: అమిత్​షా
  • కర్నాటకలో పూర్తి మెజార్టీతో అధికారంలోకి వస్తమని ధీమా

బాగల్​కోట్(కర్నాటక): మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలనే నియమం ఏదీ రాజ్యాంగంలో లేదని కేంద్ర హోంమంత్రి అమిత్​ షా అన్నారు. అందుకే కర్నాటకలో 4 శాతం ముస్లిం రిజర్వేషన్లు తొలగించామని చెప్పారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి చివరి రోజైన సోమవారం బాగల్​కోట్ జిల్లా హునగొండ లో నిర్వహించిన సభలో అమిత్ షా మాట్లాడారు. “చాలా ఆలోచించే రిజర్వేషన్లలో మళ్లీ రిజర్వేషన్లు పెట్టారు. 4 శాతం ముస్లిం రిజర్వేషన్లను 6 శాతానికి పెంచుతామని చెప్తున్న కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య.. మరీ ఎవరి రిజర్వేషన్లకు కోత పెడ్తారో  కర్నాటకలో ఎన్నికల ప్రచార గడువు ముగిసే లోపు స్పష్టం చేయాలె’’ అని డిమాండ్​ చేశారు. పాపులర్ ఫ్రంట్​ ఆఫ్ ఇండియా(పీఎఫ్​ఐ)ను బ్యాన్ చేసి బీజేపీ ప్రభుత్వం దేశంలో శాంతి భద్రతలను కాపాడింది.

 అయితే బీజేపీ చర్యను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ ఆ సంస్థపై నిషేధం ఎత్తివేస్తామని చెప్తున్నది. “4 శాతం ముస్లిం రిజర్వేషన్లను బీజేపీ ఎట్టి పరిస్థిత్తుల్లో ఒప్పుకోదు. అలాగే లింగాయత్​లకు కేటాయించిన 6 శాతం రిజర్వేషన్లలో కోత పెడ్తామంటే ఎంత మాత్రం అంగీకరించదు”అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రతిచోట తప్పుడు హామీలు ఇస్తున్నదని.. ఎన్నికల్లో ఓడిపోతున్నదని ఎద్దేవా చేశారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సోషల్ డెమెక్రటిక్​ పార్టీ ఆఫ్ ఇండియా(ఎస్​డీపీఐ), పీఎఫ్​ఐ మద్దతు తీసుకుంటున్నదని.. కన్నడ ప్రజలకు ఇది ఎంత మాత్రం నచ్చదని.. దీనిపై వారు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. కర్నాటకలో బీజేపీ పూర్తి మెజారిటీతో తిరిగి అధికారంలోకి వస్తుందని చెప్పారు.

‘మైతై’లకు ఎస్టీ హోదాపై అందరి అభిప్రాయంతో నిర్ణయం 

మణిపూర్​లో తీవ్ర అనిశ్చితికి కారణమైన ‘మైతై’ వర్గానికి ఎస్టీ రిజర్వేషన్ల అంశంపై రాష్ట్రంలోని అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలు తీసుకుంటామని కేంద్ర హోంమంత్రి అమిత్​షా తెలిపారు. మణిపూర్​లో హింస, తీవ్ర ఆందోళనకర పరిస్థితులు నెలకొనడంపై సోమవారం ఆయన మాట్లాడారు. మైతైలకు ఎస్టీ హోదా ఇచ్చే విషయంలో మణిపూర్ రాష్ట్ర సర్కార్ అన్ని ప్రభావిత వర్గాల అభిప్రాయాలు తెలుసుకొని తగిన నిర్ణయం తీసుకుంటుందన్నారు. 

ఈ అంశంపై అన్ని వర్గాలతో చర్చించండని కోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది. మణిపూర్ సర్కార్ అందరితో సంప్రదింపులు జరిపి సరైన నిర్ణయం తీసుకుంటుందని.. ఇకపై ఈ విషయంలో ఏ వర్గం కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అమిత్​ షా చెప్పారు.