చైనాలో దుకాణం క్లోజ్ చేస్తోన్న జెఫ్ బెజోస్ ఈ కామర్స్ సంస్థ అమెజాన్.. ఇండియాలో పెట్టుబడులు కొనసాగిస్తోంది. తన ఇండియన్ యూనిట్ అమెజాన్ సెల్లర్ సర్వీసెస్లో తాజాగా రూ.2,800 కోట్ల పెట్టుబడులు పెట్టినట్టు ప్రకటించింది. ఈ ఏడాది చేపట్టిన తొలి దఫా క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ ఇదే. దీంతో మొత్తంగా బెజోస్ కంపెనీ నుంచి ఇండియన్ మార్కెట్లోకి ఇప్పటి వరకు వచ్చిన పెట్టుబడులు రూ.30,090 కోట్లుగా ఉన్నాయి. అమెజాన్ ఇండియాలో 5 బిలియన్ డాలర్ల(రూ.35 వేల కోట్లకు పైగా) పెట్టుబడులు పెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. గతేడాది డిసెంబర్లో అమెజాన్ ఇదే సంస్థలో రూ.2,200 కోట్ల పెట్టుబడులు పెట్టింది. ఆరు నెలల వ్యవధిలోనే మళ్లీ ఇండియన్ మార్కెట్లో అమెజాన్ తాజాగా ఈ పెట్టుబడులు పెట్టినట్టు ప్రకటించింది.
ఇండియన్ ఈ–కామర్స్ మార్కెట్ లీడర్ ఫ్లిప్కార్ట్కు గట్టి పోటీ ఇచ్చేందుకు తాజాగా పెట్టిన ఈ పెట్టుబడులు సాయపడతాయి. గతేడాదే ఫ్లిప్కార్ట్ను వాల్మార్ట్ చేజిక్కించుకుని అమెజాన్కు గట్టి షాకిచ్చింది. చైనాలో తన మార్కెట్ప్లేస్ను జూలై నుంచి మూసివేస్తున్నట్టు అమెజాన్ ఏప్రిల్లో ప్రకటించింది. ఈ ప్రకటన తర్వాత ఇండియాలో పెట్టిన తొలి పెట్టుబడి ఇదే. అమెజాన్ ఇండియా 2.8 బిలియన్ ఈక్విటీ షేర్లను ఒక్కోటి రూ.10లకు కేటాయించింది. మొత్తంగా ఇవి రూ.2,800 కోట్లు. ప్రస్తుతం ఉన్న వాటాదారులకు రైట్స్ బేసిస్లో ఈ షేర్లను జారీ చేస్తున్నట్టు రెగ్యులేటరీ డాక్యుమెంట్స్లో అమెజాన్ ఫైల్ చేసింది. ఈ క్యాపిటల్ ఇన్ఫ్యూజన్కు మే 21న అమెజాన్ సెల్లర్ సర్వీసెస్ బోర్డు ఆఫ్ డైరెక్టర్లు ఒక రిజల్యూషన్ను పాస్ చేశారు. అమెజాన్ సెల్లర్ సర్వీస్లు..
అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు….
ఇండియా ఇటీవల ఈకామర్స్ రంగంలో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్(ఎఫ్డీఐ) నిబంధనలను మార్చింది. దీంతో అమెజాన్ బాగా ప్రభావితమవుతోంది. ఈ క్లిష్ట సమయంలో తాజా పెట్టుబడులు అమెజాన్ ఇండియాకు సహకరించనున్నాయి. డిసెంబర్లో ప్రకటించిన నిబంధనల ప్రకారం.. ఏ కంపెనీలో అయితే ఈకామర్స్ సంస్థలకు ఈక్విటీ వాటాలుంటాయో ఆ కంపెనీల ప్రొడక్ట్లను ఆన్లైన్ రిటైలర్లు అమ్మడానికి వీలులేదు. తమ ప్లాట్ఫామ్స్పై ఎక్స్క్లూజివ్గా ప్రొడక్ట్లను అమ్మేందుకు సెల్లర్స్తో డీల్స్ కుదుర్చుకోవడానికి కుదరదు. ఒకే ప్లాట్ఫామ్ నుంచి 25 శాతానికి పైగా రెవెన్యూలను వెండార్లు సంపాదించేందుకు అనుమతి లేదు. దీంతో అమెజాన్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ ఉన్న సెల్లర్స్ క్లౌడ్టైల్, అప్పారియో ప్రొడక్ట్లను అమెజాన్.ఇన్ ప్లాట్ఫామ్పై నుంచి తీసేసింది. అంతేకాక క్లాతింగ్ డిపార్ట్మెంటల్ స్టోర్ షాపర్స్ స్టాప్ ను కూడా తొలగించింది. ఈ కంపెనీలో కూడా అమెజాన్కు 5 శాతం వాటాలున్నాయి. కొత్త నిబంధనలు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వచ్చాయి. అమెజాన్ పాంట్రీ సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసింది.
గ్రోసరీలోకి రూ.3,474 కోట్లు….
అమెజాన్ 500 మిలియన్ డాలర్లను(రూ.3474 కోట్లను) తన ఫుడ్ రిటైల్ వెంచర్లో పెట్టాలనుకుంటోంది. ఈగ్రోసరీ స్పేస్లో అత్యధికంగా పోటీ పెరగడంతో ఈ పెట్టుబడులు పెట్టేందుకు చూస్తోంది. వ్యాపారాల్లో వృద్ధి కోసం గ్రోసరీ కేటగిరీపై అమెజాన్.ఇన్ ఎక్కువగా దృష్టి సారించింది. అమెజాన్ ప్రత్యర్థి ఫ్లిప్కార్ట్ కూడా గ్రోసరీ సెగ్మెంట్పైనే ఎక్కువగా ఫోకస్ చేసింది. ఇండియన్ ఈకామర్స్ మార్కెట్ 2026 నాటికి 200 బిలియన్ డాలర్లు అంటే రూ.13,89,410 కోట్లకు చేరనుంది. ఇంతలా అభివృద్ధి చెందుతుండటంతో ఈ మార్కెట్పై కంపెనీలు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాయి. రిలయన్స్ కూడా ఈకామర్స్ మార్కెట్లోకి ఎంటరవ్వాలనుకుంటోంది. కామర్స్, ఇండస్ట్రీ మినిస్ట్రీ ఏర్పాటు చేసిన ఇండియన్ బ్రాండ్ ఈక్విటీ ఫౌండేషన్ ప్రకారం ఇండియా ఈకామర్స్ రెవెన్యూ 2020లో రూ.8,33,430 కోట్లకు ఎగుస్తుందని అంచనా. 2017లో ఇది రూ.2,70,864 కోట్లుగా ఉంది. ఈకామర్స్ వ్యాపారం ఏటా 51% పెరుగుతోంది.
