కోల్ కతా: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కీలక వ్యాఖ్యలు చేశారు. సీఏఏ ఫైనల్ డ్రాఫ్ట్ వచ్చే యేడాది మార్చి 30 నాటికి సిద్ధమవుతుందని తెలిపారు. ఆదివారం నార్త్ 24 పరగణాల జిల్లా ఠాకూర్ నగర్ లో మాటువా కమ్యూనిటీని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. రెండేళ్లుగా సీఏఏ ను తీసుకొచ్చే ప్రాసెస్ ను వేగవంతం చేశామన్నారు. సీఏఏ ఫైనల్ డ్రాఫ్ట్ త్వరలోనే సిద్ధమవుతుందని పేర్కొన్నారు.
అజయ్ వ్యాఖ్యలపై టీఎంసీ రాజ్య సభ ఎంపీ శాంతను సేన్ స్పందించారు. “బీజేపీకి ఎన్నికల సమయంలోనే సీఏఏ, మాటువాలు గుర్తుకు వస్తారని విమర్శించారు. బెంగాల్లో సీఏఏను ఎట్టి పరిస్థితుల్లో అమలుచేయనివ్వబోమని చెప్పారు. బీజేపీ తప్పుడు హామీలు అందరికి అర్థమవుతున్నాయన్నారు. అయితే, సీఏఏ ను అమలు చేస్తే పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ నుంచి 2014, డిసెంబర్ 31లోగా ఇండియాకు వచ్చిన హిందువులు, సిక్కులు, బుద్ధులు, జైనులు, పార్శీలు, క్రిస్టియన్లలకు భారత పౌరసత్వం ఇవ్వవచ్చు.
