దేశంలోని అతిపెద్ద టెలికాం కంపెనీ భారతీ ఎయిర్టెల్ సోమవారం తన ‘వాయిస్ ఓవర్ వైఫై(వీఓవైఫై)’ సేవలను ప్రారంభించింది. ఈ సేవలు తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాలలో అందుబాటులోకి రానున్నాయి. ఎయిర్టెల్ వైఫై కాలింగ్ సేవలకు అదనంగా ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని, కేవలం డేటా మాత్రమే ఖర్చవుతుందని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, భారతీ ఎయిర్టెల్ సీఈఓ అవ్నీత్ సింగ్ పూరీ అన్నారు. ఇళ్లల్లో, ఆఫీసుల్లో మీరు వైఫై ద్వారా ఏ నెట్వర్క్కు అయినా కాల్స్ కనెక్ట్ చేసుకోవచ్చని తెలిపారు. మీ స్మార్ట్ఫోన్లో వైఫై కాలింగ్ సదుపాయం ఉందో లేదో ఎయిర్టెల్. ఇన్ వైఫై /కాలింగ్ వెబ్సైట్ ఓపెన్ చేసి తెలుసుకోవచ్చు. ఈ రెండు రాష్ర్టాలతోపాటు ముంబై, కోల్కతా, కర్ణాటక, తమిళనాడులో కూడా కంపెనీ ఈ సేవలను ప్రారంభించింది. ఎయిర్టెల్ ఈ ప్రాంతాలకు ముందు ఢిల్లీ–ఎన్సీఆర్లో ఈ సేవలను అందుబాటులోకి తెచ్చింది. వీఓ వైఫై టెక్నాలజీతో పబ్లిక్ హాట్స్పాట్ లేదా ప్రైవేట్ హోం వైఫై నెట్వర్క్కు కనెక్ట్ చేసుకొని ఏ మొబైల్ఫోన్కైనా, ల్యాండ్లైన్కైనా కాల్స్ చేసుకోవచ్చు.
ఈ స్మార్ట్ఫోన్స్కు సపోర్ట్ చేస్తుంది..
ప్రస్తుతం 6 ఎస్ , అంతకన్నా ఎక్కువగా ఉన్న అన్ని ఐఫోన్ మొబైల్స్, షియోమి రెడ్మి కే20, రెడ్మి కే20 ప్రో, పోకో ఎఫ్1, శామ్సంగ్ జే6, ఏ10ఎస్, ఆన్6, ఎస్10, ఎస్10 ప్లస్, ఎస్10ఈ, ఎం20, అన్ని వన్ ప్లస్ 7, 6 సిరీస్ డివైస్లపై ‘ఎయిర్టెల్ వైఫై కాలింగ్’ సపోర్ట్చేస్తుందని కంపెనీ ప్రెస్ రిలీజ్లో తెలిపింది. వాట్సప్ వంటి ఓటీటీ కంపెనీల పోటీ తట్టుకుని తమ రెవెన్యూ కాపాడుకోవడానికి వీఓ వైఫై ఎయిర్టెల్కు ఉపయోగపడుతుందని విశ్లేషకులు తెలిపారు. ‘ఎయిర్టెల్ వైఫై కాలింగ్’ సేవలను అందించేందుకు అన్నిరకాల లీడింగ్ స్మార్ట్ఫోన్ బ్రాండ్స్తో కలిసి పనిచేస్తున్నామని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం ఈ సేవలు ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్ హోం బ్రాడ్ బ్రాండ్పై దొరుకుతాయని, భవిష్యత్తులో అన్నిరకాల బ్రాడ్బ్యాండ్ సర్వీసులు, వైఫై హాట్స్పాట్లలో అందుబాటులోకి వస్తాయని తెలిపింది.
