- 200 విమానాలు కొననున్న ఎయిర్ ఇండియా!
- ఏ350 విమానాలను కొనే అవకాశం
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా ఏకంగా 200 విమానాలను కొనాలని చూస్తోంది. వచ్చే ఐదేళ్లలో ఈ విమానాలను కొనేందుకు ఎయిర్బస్, బోయింగ్తో కంపెనీ చర్చలు జరుపుతోందని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. ‘ఇక టైమ్ లేదు. ఎయిర్ ఇండియా తన సామర్ధ్యాన్ని వేగంగా పెంచుకోవాలి’ అని అన్నారు. ఈ 200 విమానాల్లో 70 శాతం విమానాలు చిన్నవి కాగా, 30 శాతం విమానాలు పెద్దవని వివరించారు. ‘ఎయిర్బస్, బోయింగ్ రెండింటితోనూ చర్చలు జరుపుతున్నాం. కానీ, బోయింగ్ ఆలస్యంగా విమానాలను డెలివరీ చేస్తుంది’ అని ఎయిర్ ఇండియా టాప్ ఉద్యోగి ఒకరు పేర్కొన్నారు. టాటా గ్రూప్ కింద ఎయిర్ ఇండియా కొత్తగా మారుతోందని, ఇందుకోసం తన పాత విమానాలను కొత్త వాటితో భర్తీ చేయనుందని ఎయిర్బస్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ క్రిస్టియన్ స్కెరెర్ అన్నారు. ఏ350 విమానాలను కొనేందుకు ఎయిర్బస్తో ఎయిర్ ఇండియా చర్చలు జరుపుతోందని ఈ విషయం తెలిసిన వ్యక్తులు పేర్కొన్నారు. కాగా, ఒకవేళ ఈ వార్తలు నిజమయితే 2006 తర్వాత మొదటిసారిగా విమానాల కోసం ఎయిర్ ఇండియా ఆర్డర్ పెట్టినట్టు అవుతుంది. అంతేకాకుండా ఏ350 విమానాల ట్రెయినింగ్ కోసం పైలెట్లు రిజిస్టర్ చేసుకోవాలనే మెమోను ఎయిర్ ఇండియా రిలీజ్ చేసినట్టు వార్తలొస్తున్నాయి.
