- బెంగళూరు నుంచి ఢిల్లీవెళ్తుండగా ఘటన
- విమానంలోనే45 నిమిషాలు ట్రీట్మెంట్
న్యూఢిల్లీ: బెంగళూరు నుంచి ఢిల్లీకి బయలుదేరిన విమానంలో రెండేండ్ల చిన్నారికి ఎయిమ్స్ డాక్టర్లు ప్రాణం పోశారు. ఈ ఘటన ఆదివారం జరిగింది. విమానం గాల్లో ఉండగానే ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ చేసి బతికించారు. విస్తారా ఎయిర్లైన్స్ విమానం ఆదివారం సాయంత్రం బెంగళూరు నుంచి ఢిల్లీకి బయలుదేరింది. ప్రయాణికుల్లో ఓ కుటుంబం.. గుండె సమస్యతో బాధపడుతున్న తమ రెండేండ్ల చిన్నారిని చికిత్సకోసం ఢిల్లీకి తీసుకెళ్తోంది. టేకాఫ్ అయిన కాసేపటికే ఆ చిన్నారి పరిస్థితి విషమంగా మారింది. శ్వాస తీసుకోవడం ఆగింది. పెదాలు, వేళ్లు కూడా నీలి రంగులోకి మారిపోయాయి. సమాచారం తెలుసుకున్న విమాన సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే ఫ్లైట్ను నాగ్పూర్ వైపునకు మళ్లించారు.
ఐదుగురు డాక్టర్ల బృందం
విమానంలో ఎవరైనా డాక్టర్లు ఉంటే వెంటనే చిన్నారికి సాయంచేయాలని సిబ్బంది అనౌన్స్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఐదుగురు ఎయిమ్స్ డాక్టర్ల బృందం చిన్నారి వద్దకు వెళ్లింది. వీరు ఇండియన్ సొసైటీ ఫర్ వాస్కులర్ అండ్ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ సదస్సుకు హాజరై.. ఢిల్లీకి వెళ్తున్నారు. చిన్నారికి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడాన్ని గమనించి సీపీఆర్ చేయడంతో ఆ పాప తిరిగి ఊపిరి పీల్చుకోవడం ప్రారంభించింది.
ఐదుగురు డాక్టర్లు సుమారు 45 నిమిషాలు శ్రమించారు. చివరికి పాప హెల్త్ కండీషన్ స్టేబుల్ కావడంతో విమానంలోని ప్రయాణికులంతా డాక్టర్లకు ధన్యవాదాలు చెప్పారు. విమానం ల్యాండ్ అయిన తర్వాత ఆ పాపను హాస్పిటల్కు తరలించారు. పాపకు ప్రాణం పోసిన వైద్యులు.. డాక్టర్ నవదీప్ కౌర్, డాక్టర్ దమన్దీప్ సింగ్, డాక్టర్ రిషబ్ జైన్, డాక్టర్ ఓషికా, డాక్టర్ అవిచలా టాక్సాక్ అని విస్తారా ఎయిర్ లైన్స్ ట్వీట్ చేసింది.
