చెన్నై: ఇళ్లు లేని వారందిరికీ ఉచిత గృహాలు, ఇంటికో ఉద్యోగం కల్పిస్తామని అన్నాడీఎంకే ఎన్నికల మేనిఫెస్టో హామీ ఇచ్చింది. సీఎం పళని స్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఆదివారం సాయంత్రం పార్టీ ప్రధాన కార్యాలయంలో సంయుక్తంగా ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. అమ్మ హౌసింగ్ స్కీమ్ ద్వారా ప్రస్తుతం ఇళ్లు లేని వారందరికీ ఇళ్లు ఇస్తామని మేనిఫెస్టోలో భరోసా ఇచ్చారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలను గుర్తించి, ఉచితంగా ఇళ్లు కట్టించి ఇస్తామని, పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల్లోనే రెసిడెన్షియల్ ఆపార్ట్మెంట్లు నిర్మించి ఇస్తామని మేనిఫెస్టో తెలిపింది. ఇంటికో ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చింది. బీపీఎల్ కుటుంబాలకు ఉచితంగా వాషింగ్ మిషన్లు, సోలార్ స్టవ్లు ఇస్తామని, ప్రతి ఇంటికి ఉచితంగా కేబుల్ టీవీ సదుపాయం కల్పిస్తామని తెలిపింది.
