మనాలి టు లడఖ్... దాదాపుగా నాలుగొందల ముప్పై కిలోమీటర్లు. రోడ్డు పొడవునా రాళ్లు, గుంతలు, నీళ్లు. లోయలు, మలుపులు. ఇంతటి అడ్వెంచరస్ జర్నీని కేవలం 55 గంటల 13 నిమిషాల్లో పూర్తి చేసింది ప్రీతి మస్క. అది కూడా సైకిల్పై 45 ఏండ్ల వయసులో. ఈ ఫీట్తో గిన్నిస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సాధించింది. అలాగని ఈమె ప్రొఫెషనల్ సైక్లిస్ట్ కాదు. 40 ఏండ్ల వయసులో తనకి ఎదురైన హెల్త్ ఇష్యూలకి ట్రీట్మెంట్గా సైకిల్ ఎక్కిందామె. పూణేలో పుట్టి, పెరిగిన ప్రీతికి చిన్నప్పట్నించీ ఆటలంటే ఇష్టం. స్కూల్లో చదువుకునే రోజుల్లో నేషనల్ హాకీ, బాస్కెట్ బాల్ ప్లేయర్గా ఎన్నో మెడల్స్ అందుకుంది. పెద్దవుతున్న కొద్దీ చదువులో పడి.. ఆటల్ని పక్కనపెట్టింది. ఆ తర్వాత ఉద్యోగం, పెండ్లి, ఇద్దరు పిల్లల బాధ్యతతో ఆటల ఊసే మర్చిపోయింది. పని ఒత్తిడితో తనని తాను పట్టించుకోలేదు కూడా. దాంతో 40 ఏండ్ల వయసులో ఎనీమియా, హార్మోనల్ ఇంబాలెన్స్, పీసీఓఎస్ లాంటి సమస్యలొచ్చాయి ఆమెకి.
ఆ ఎంకరేజ్మెంట్తో
ఆ సమస్యలకి ట్రీట్మెంట్ తీసుకుంటున్న టైంలోనే.. ఆమె కొడుకు చదువుకుంటున్న స్కూల్లో పేరెంట్స్ కోసం ఒక రన్నింగ్ కాంపిటీషన్ పెట్టారు. ఆ పోటీలో ప్రీతి స్పీడ్ చూసి, ఆ స్కూల్ కోచ్ సైక్లింగ్, స్విమ్మింగ్, రన్నింగ్ పోటీలు జరిగే ఎండ్యూరో అబ్స్టకిల్ రేసు గురించి చెప్పాడు. నలభైల్లో ఇదంతా నావల్ల కాదనుకుంది మొదట్లో ప్రీతి. కానీ, ఆ కోచ్ ఇచ్చిన ఎంకరేజ్మెంట్తో సైకిల్ ఎక్కింది. ఆ కాంపిటీషన్ గెలిచింది. ఆ ప్రాసెస్లో హెల్త్ ఇష్యూస్ తగ్గిపోయాయి. ఇంట్లో వంటగది నుంచి హాల్లోకి నడిస్తేనే ఆయాస పడే ఆమె బాగా యాక్టివ్ అయింది. పైగా తనలో పాజిటివిటీ పెరిగింది. దాంతో మరిన్ని ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయాలనుకుంది. '
మనాలి నుంచి లడఖ్
ఆ ప్రయత్నంలోనే ముప్పైకి పైగా హాఫ్ మారథాన్స్, నాలుగు ఫుల్ మారథాన్స్ గెలిచింది. రెండు అల్ట్రా మారథాన్స్ని గెలిచేసింది. ఆ ఇన్స్పిరేషన్తో 2019 లో 17 రోజుల్లో కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు మొత్తం 3,773 కిలోమీటర్లు గ్రూప్తో కలిసి సైక్లింగ్ చేసింది. అందుకు మొదటిసారి గ్రూపు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్కి ఎక్కింది. ఆ తర్వాత 2021లో 24 రోజుల్లో 6, 000 కిలోమీటర్లు సైకిల్పై చుట్టేసింది. ఆ వెంటనే నాసిక్ నుంచి అమృత్సర్కు సైక్లింగ్ చేసి ‘సూపర్ రాండన్యూర్’ టైటిల్ అందుకున్న మొదటి మహిళగా నిలిచింది. ఆ తర్వాత ఒంటరిగా మనాలి నుంచి లడఖ్ వెళ్లాలని డిసైడ్ అయింది. ఈ జర్నీ కోసం చాలా గతుకు రోడ్లలో గంటల తరబడి ప్రాక్టీస్ చేసింది. మానసికంగా తనని తాను సిద్ధం చేసుకుంది. ఈ జర్నీలో ఆమెకి మంచినీళ్లు, చాయ్, జ్యూస్లు ఇచ్చేందుకు ప్రతి స్టాప్ దగ్గర ఒకరు ఉన్నారు. అలా అందరి సపోర్ట్తో 55 గంటల 13 నిమిషాల్లోనే టార్గెట్ని చేరుకుంది. వీటన్నింటితో పాటు సైకిల్ మాడిఫికేషన్ , అడ్వెంచర్ కంపెనీలని మొదలుపెట్టింది.
“ పెండ్లి, పిల్లల తర్వాత ఆడవాళ్లు తమ గురించి తాము ఆలోచించుకోవడం మర్చిపోతారు. తమ కలలకి అడ్డంకిగా వయసుని చూస్తారు. కానీ, నిజానికి వయసు ఒక నెంబర్ మాత్రమే. దాన్ని దాటి చూస్తేనే జీవితం . నేను నలభైల్లో సైక్లింగ్ మొదలుపెట్టా. ఎన్నో దెబ్బలు తగిలాయి. అలాగని ప్రయత్నం ఆపలేదు. నాతో నేను పోటీపడుతూ ఈరోజు ఈ అడ్వెంచర్ జర్నీ పూర్తి చేశా. నాలాంటి కలలున్న ఆడవాళ్లు ఒక్క అడుగు ముందుకేస్తే సొసైటీ, ఫ్యామిలీ ఆటోమెటిక్గా సపోర్ట్ చేస్తుంది” అంది ప్రీతి.
