న్యూఢిల్లీ: అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్(ఏపీఎస్ఈజెడ్) మార్కెట్ క్యాప్ మొదటి సారిగా రూ. లక్ష కోట్లను తాకింది. కంపెనీ షేర్లు సోమవారం సెషన్లో ఆల్టైమ్ హైని తాకడంతో ఈ మైలురాయిని కంపెనీ అందుకోగలిగింది. రూ. 480.05 వద్ద ఓపెన్ అయిన కంపెనీ షేరు, రూ. 492.85 వద్ద ఆల్టైమ్ గరిష్టాన్ని తాకింది. చివరికి 1.14 శాతం లాభంతో రూ. 483.75 వద్ద ముగిసింది. ఆంధ్రాలోని కృష్ణపట్నం పోర్టును కొనుగోలు చేయడానికి అగ్రిమెంట్ కుదుర్చుకున్నప్పటి నుంచి అదానీ పోర్ట్స్ షేరు వాల్యూ పెరుగుతోంది. ఈ అగ్రిమెంట్ తర్వాత బ్రోకరేజి కంపెనీలు కంపెనీపై తమ టార్గెట్లను పెంచాయి. ఈ ఏడాది అక్టోబర్లో రూ. 12 వేల కోట్లకు కృష్ణపట్నం పోర్టును అదానీ పోర్ట్స్ కొనుగోలు చేసింది. ఈ పోర్టు వలన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 1,200 కోట్లను క్రియేట్ చేస్తుందని ఎనలిస్టులు అంచనావేస్తున్నారు. కంపెనీ షేరు ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 34 శాతం పెరిగింది. నవంబర్లో 14 శాతం పెరిగిన షేరు, ఈ నెలలో ఇప్పటి వరకు 20 శాతం లాభపడింది. రూ. లక్ష కోట్ల మైలు రాయిని అందుకున్న రెండో అదానీ గ్రూప్ కంపెనీగా అదానీ పోర్ట్స్ నిలిచింది. ఇప్పటికే అదానీ గ్రీన్ ఎనర్జీ ఈ మైలు రాయిని అందుకుంది.
అదానీ కంటైనర్ బిజినెస్ బాండ్ల ఇష్యూకి డిమాండ్..
30 కోట్ల డాలర్ల (రూ. 2,205 కోట్ల) బాండ్ల ఇష్యూ 10 రెట్లు సబ్స్క్రయిబ్ అయ్యిందని అదానీ ఇంటర్నేషనల్ కంటైనర్ టెర్మినల్(ఏఐసీటీపీఎల్) సోమవారం ప్రకటించింది. కాగా, కంపెనీకిదే మొదటి బాండ్ల ఇష్యూ. అదానీ పోర్ట్స్, టెర్మినల్ ఇన్వెస్ట్మెంట్ లు కలిసి ఏర్పాటు చేసిన ఈ జాయింట్ వెంచర్ కంపెనీ, ప్రస్తుతం ఏడాదికి 31 లక్షల ట్వంటీ ఫుట్ ఈక్విలెంట్ యూనిట్ల(టీఈయూ) కెపాసిటీని ఆపరేట్ చేస్తోంది. ఈ బాండ్ల ఇష్యూ ఈ నెల 21న ముగిసింది. 10 ఏళ్ల బాండ్లపై 3 శాతం ఈల్డ్(రాబడి)ని ఆఫర్ చేశామని ఏఐసీటీపీఎల్ తెలిపింది. గత ఐదేళ్లలో ఇదే అతి తక్కువ కూపన్ రేటని పేర్కొంది.
