న్యూఢిల్లీ: సోలార్ ఎనర్జీ, ఎయిర్పోర్టులు, పోర్టులు వంటి రంగాలలో చురుగ్గా కార్యకలాపాలు నిర్వహిస్తున్న అదానీ గ్రూప్ ఇప్పుడు డిఫెన్స్, ఏరోస్పేస్ రంగాలలో ఎంట్రీ ఇవ్వనుంది. 2030 నాటికి డిఫెన్స్ మోడర్నైజేషన్ కోసం 300 బిలియన్ డాలర్లను ఖర్చు పెట్టాలనేది మన గవర్నమెంట్ ఆలోచన. ఈ నేపథ్యంలోనే బ్రిటన్లోని కంపెనీలతో కలిసి ఈ రంగంలో పనిచేయాలనే నిర్ణయానికి వచ్చిన అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్తో డిస్కషన్స్ జరిపినట్లు సంబంధిత వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇండియాలో రెండు రోజుల పర్యటనకు వచ్చిన బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్జాన్సన్ అహ్మదాబాద్లో గౌతమ్ అదానీని కలిశారు. బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్కు తమ గ్రూప్ హెడ్ క్వార్టర్లో ఆతిధ్యం ఇవ్వడం ఆనందం కలిగిస్తోందని అదానీ చెప్పారు. క్లైమేట్, సస్టెయినబిలిటీ వంటి అంశాలలో తాము మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతూ, ప్రత్యేకించి రెన్యువబుల్ ఎనర్జీ, గ్రీన్హెచ్2, న్యూ ఎనర్జీలపై అదానీ గ్రూప్ దృష్టి పెడుతోందన్నారు. డిఫెన్స్, ఏరోస్పేస్ టెక్నాలజీ రంగాలలోనూ యూకే కంపెనీలతో తమ గ్రూప్ కలిసి పనిచేస్తుందని వెల్లడించారు. రెండు రోజుల పర్యటనకు వచ్చిన జాన్సన్ మొదటి రోజయిన గురువారం గుజరాత్లోని అహ్మదాబాద్కు చేరారు. ఇండియా–బ్రిటన్ దేశాల మధ్య సహకారం మరింత పెంచడంపై జాన్సన్ ఈ టూర్లో ఫోకస్ చేస్తున్నారు. వ్యాపారపరమైన అంశాలకు సంబంధించిన ఫ్రీట్రేడ్ అగ్రిమెంట్ సహా, పలు అగ్రిమెంట్లపై ఈ పర్యటన సందర్భంగా ఆయన ఎనౌన్స్మెంట్లు చేస్తారని అంచనా. ఇండియాతో వాణిజ్యం, పెట్టుబడులు, టెక్నాలజీ రంగాలలో భాగస్వామ్యం వంటి వాటిపై ఆయన ఈ పర్యటనలో దృష్టి పెట్టనున్నారు. ఇండియన్స్కు మరిన్ని ఎక్కువ వీసాలు ఇవ్వాలని కోరుకుంటున్నట్లు జాన్సన్ వెల్లడించారు. ఐటీ, ప్రోగ్రామింగ్ సెగ్మెంట్లలో తమ దేశంలో వ్యక్తుల కొరత ఉందని, టాలెంట్ ఉన్న వాళ్లను తమ దేశానికి ఆహ్వానించనున్నామని పేర్కొన్నారు. ఇండో–పసిఫిక్ ప్రాంతంలోని దేశాలతో వాణిజ్యం ఎక్కువగా చేయాలని యూకే ఆశిస్తోంది.
