న్యూఢిల్లీ: అదానీ గ్రూప్, విదేశీ లోన్ల ద్వారా 4.5 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.35 వేల కోట్లు) వరకు సేకరించడానికి డజనుకు పైగా విదేశీ బ్యాంకులతో చర్చలు జరుపుతోంది. ఒక భారతీయ కార్పొరేట్ సంస్థ విదేశీ కరెన్సీలో తీసుకుంటున్న భారీ లోన్లలో ఇదీ ఒకటి. ప్రతిపాదిత లోన్ స్ట్రక్చర్లలో మెజ్జనైన్ ఫైనాన్సింగ్, స్టాక్-బ్యాక్డ్ బ్రిడ్జ్ లోన్లు ఉంటాయి. వీటిని నగదు రూపంలో తిరిగి చెల్లిస్తారు. లోన్లను దీర్ఘకాల బాండ్ లేదా లోన్తో తర్వాత రీఫైనాన్స్ చేయవచ్చు. లిస్టెడ్ సిమెంట్ కంపెనీలైన అంబుజా సిమెంట్స్, ఏసీసీలో హోల్సిమ్ వాటాల కొనుగోలుకు ఫైనాన్స్ చేయడానికి తాజా రౌండ్ నిధుల సేకరణ ద్వారా వచ్చే ఆదాయాన్ని వాడుతారు. సీనియర్ డెట్ ఫెసిలిటీ కింద మూడు బిలియన్ డాలర్ల వరకు సమీకరించవచ్చు. మెజ్జనైన్ లైన్ లోన్తో బిలియన్ డాలర్లను సేకరించవచ్చు. బ్రిడ్జ్ లోన్ 500 మిలియన్ల డాలర్ల వరకు ఉంటుంది. వీటిని నగదు రూపంలో తిరిగి చెల్లిస్తారు. లోన్ల కోసం బీఎన్పీ పారిబాస్, సిటీ, జేపీ మోర్గాన్, ఎంయూఎఫ్జీ, మిజుహో బ్యాంక్, ఎస్ఎంబీసీ వంటి వాటితో చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.
