- దగ్గరుండి శిక్షణ ఇప్పిస్తున్న పాక్ ఐఎస్ఐ
న్యూఢిల్లీ: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(పీవోకే)లో ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ) ఆధ్వర్యంలో టెర్రరిస్ట్ క్యాంపులు నడుస్తున్నాయి. పీవోకేలోని మన్షేరా, ముజఫరాబాద్, కోట్లి క్లస్టర్లలో లష్కర్ఏ తొయిబా(ఎల్ఈటీ), జైష్ ఏ మహమద్(జేఈఎం), అల్ బదర్, హర్కత్వుల్ ముజాహిదీన్ తదితర టెర్రర్ సంస్థలు ఈ క్యాంపులను నిర్వహిస్తున్నాయి. మన్షేరా క్లస్టర్లో బోయి, బాలాకోట్, గర్హి హబిబుల్లాల్లో క్యాంపులు ఉన్నాయి. ముజఫరాబాద్ క్లస్టర్లో ఛేలాబండీ, షవైనలా, అబ్దుల్లా బిన్ మసూద్, దులై ప్రాంతాల్లో క్యాంపులు నడుస్తున్నాయి. కోట్లి క్లస్టర్లోని సేన్సా, కోట్లి, గుల్పూర్, ఫగోష్, దుబ్గిల్లో నడుస్తున్న టెర్రరిస్టు కార్యకలాపాలను పాక్ ఆర్మీకి చెందిన మూడు బ్రిగేడ్లు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాయి. ఎల్వోసీ కి 2 నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గురేజ్, కెల్, నీలమ్ వ్యాలీ, తంగ్ధార్, యురి ఛకోటి, గుల్మార్గ్, పూంచ్, రాజౌరి, నౌషేరా, సుందర్బనీ సెక్టార్లలో ఉండే లాంచ్ ప్యాడ్లకు ఫీడర్ల కోసం ఈ క్యాంపులు నడుస్తున్నాయని సమాచారం.
మిషన్ కాశ్మీర్
ఐఎస్ఐ మిషన్ కాశ్మీర్ ఆపరేషన్ చేపట్టిందని, ఈ రీజియన్లో మనుగడ, ప్రాధాన్యత దృష్ట్యా ఈ ఆపరేషన్ చేపట్టిందని ఐఎస్ఐ రిటైర్ట్ అధికారి ఒకరు వెల్లడించారు. ఇందుకోసం ఎల్ఈటీ, జేఈఎం, తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్, ఇస్లామిక్ స్టేట్ విలయాహ్ హింద్ తదితర గ్రూపులతో కలిపి ఒక కొత్త గ్రూపును ఏర్పాటు చేస్తోందని, దానితో కలిసి జమ్మూ కాశ్మీర్ విముక్తి కోసం ఈ పోరాటమని చెబుతోందని పేర్కొన్నారు.
