న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్టై.. జైలులో ఉన్న ఆమ్ఆద్మీ పార్టీ నేత సంజయ్ సింగ్ కు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ షాక్ ఇచ్చారు. ఆయన రాజ్యసభ ఎంపీగా ప్రమాణానికి ధన్ఖడ్ అనుమతి నిరాకరించారు. సంజయ్ వ్యవహారం రాజ్యసభ ప్రివిలెజెస్ కమిటీ వద్ద ఉందని, ఆయనపై హక్కుల ఉల్లంఘన కేసును కమిటీ విచారిస్తోందని ఆయన తెలిపారు. సంజయ్ సింగ్ ను జనవరిలో ఆప్ రెండోసారి రాజ్యసభకు నామినేట్చేసిన విషయం తెలిసిందే. సంజయ్తో పాటు ఢిల్లీ మహిళా కమిషన్ మాజీ చీఫ్ స్వాతి మలివాల్, చార్టర్డ్ అకౌంటెంట్ నరైన్ దాస్ గుప్తాను నామినేట్ చేసింది. ఇందులో సంజయ్ మినహా వారిద్దరూ ప్రమాణం చేశారు.
దీంతో రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసేందుకు, అలాగే, ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యేందుకు 7 రోజుల మధ్యంతర బెయిల్ ఇవ్వాలని సంజయ్ ఈ నెల 1న ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత తన పిటిషన్ను సవరించి కేవలం ప్రమాణస్వీకారానికి మాత్రమే పర్మిషన్ ఇవ్వాలని కోరారు. దీంతో ఢిల్లీ కోర్టు ఆయన జ్యుడీషియల్ కస్టడీని ఈ నెల 17 వరకు పొడిగిస్తూ.. పోలీసు కస్టడీలో పార్లమెంటుకు వెళ్లి ప్రమాణ స్వీకారం చేసేందుకు అనుమతించింది. సంజయ్ని సోమవారం ఉదయం 10 గంటలకు పార్లమెంటుకు తీసుకెళ్లి ప్రమాణ స్వీకారం చేయించాలని స్పెషల్జడ్జి ఎంకే నాగ్పాల్ జైలు అధికారులను ఆదేశించారు. కోర్టు ఆదేశాల ప్రకారం పోలీసులు పార్లమెంట్కు తీసుకెళ్లినా.. ప్రమాణానికి రాజ్యసభ చైర్మన్పర్మిషన్ ఇవ్వలేదు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో సంజయ్ని ఈడీ గత ఏడాది అరెస్ట్ చేసింది.
