ఆధార్‌‌ వచ్చాక నిజమైన లబ్ధిదారులకు మేలు

ఆధార్‌‌ వచ్చాక నిజమైన లబ్ధిదారులకు మేలు

భారత్‌లో ఆధార్ కార్డులు లాంచ్ అయ్యి దశాబ్దం గడిచిందని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) సీఈవో సౌరభ్ గార్గ్‌ చెప్పారు. నేటి వరకూ మొత్తం 131 కోట్ల ఆధార్ కార్డులను జారీ చేశామని ఆయన తెలిపారు. సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఆయన మాట్లాడుతూ ఆధార్ అమలులోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పథకాల అమలులో అక్రమాలకు తావు లేకుండా చేయగలిగామన్నారు. ఫేక్ లబ్ధిదారులకు నిర్మూలించడంలో ఆధార్ ఉపయోగపడిందని చెప్పారు.

300 కేంద్ర పథకాలు, 400 రాష్ట్ర పథకాలకు లింక్‌

సంక్షేమ పథకాలకు ఆధార్ లింక్ చేసి, నిజమైన లబ్ధిదారులకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ చేయడం ద్వారా  ప్రభుత్వం రూ.2.25 లక్షల కోట్లను ఆదా చేయగలిగిందని సౌరభ్ గార్గ్ అన్నారు. ఇప్పటి వరకు ఆధార్‌‌తో 300 కేంద్ర ప్రభుత్వ పథకాలు, 400 రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు లింక్‌ అయ్యాయని చెప్పారు. దేశంలో 99.7 శాతం వయోజనులు ఆధార్‌‌ ఎన్‌రోల్‌ చేసుకున్నారని, నవజాత శిశువులకు కూడా ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ చేసేందుకు అన్ని రకాలుగా కృషి చేస్తున్నామని తెలిపారు. ఆధార్ డేటాను కాపాడేందుకు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన సెక్యూరిటీ వ్యవస్థను ఉపయోగిస్తున్నామని చెప్పారు.

లీగల్‌ ఐడెంటిటీగా..

ఆధార్ సాయంతో చిన్న చిన్న పల్లెల్లో కూడా ఫింగర్‌‌ ప్రింట్ అథెంటికేషన్‌ ద్వారా ప్రజలు తమ అకౌంట్‌లో డబ్బు విత్‌ డ్రా చేయడం లేదా డిపాజిట్ చేయడం కూడా సాధ్యమవుతోందని గార్గ్ చెప్పారు. ప్రతి పౌరుడికీ లీగల్ ఐడెంటిటీ ఉండాలన్నది.. 2030 నాటికి సాధించాలని నిర్దేశించుకున్న సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో ఒకటని, భారత్‌లో దీనిని సాధించేందుకు ఆధార్‌‌ ఉపయోగపడిందని అన్నారు.