పొదుపు చేయడం గురించి 65 శాతం మంది మగవాళ్లు సొంతంగా నిర్ణయం తీసుకుంటున్నారని ఒక సర్వేలో వెల్లడయింది. ఇన్వెస్ట్మెంట్ల గురించి తమ సంతానానికి వేర్వేరుగానే సలహాలు ఇస్తామని 70 శాతం మంది పురుషులు, మహిళలు చెప్పారు. తమ సంతానం జెండర్ను బట్టి ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీని మారుస్తామని 41 శాతం మంది అంటున్నారు.
న్యూఢిల్లీ: భారతీయుల పొదుపు/ఇన్వెస్ట్మెంట్ల గురించి డీఎస్పీ ‘విన్వెస్టర్ పల్స్ 2022’ స్టడీ ఆసక్తికర విషయాలను బయటికి తీసుకొచ్చింది. ఈ సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు ప్రతి ముగ్గురు పురుషులలో ఇద్దరు (65శాతం) పెట్టుబడి పెట్టే ముందు ఎవరి సలహానూ తీసుకోవడం లేదు. కేవలం 44శాతం మంది మహిళలు మాత్రమే సొంతగా పెట్టుబడి నిర్ణయాలను తీసుకుంటామని చెప్పారు. డీఎస్పీ మ్యూచువల్ ఫండ్, పరిశోధనా సంస్థ యూగవ్తో సహకారంతో నిర్వహించిన సర్వే ప్రకారం... పెట్టుబడి విషయాల్లో మగవారి, ఆడవారి ఆలోచనలు వేర్వేరుగా ఉన్నాయి. మహిళలతో పోలిస్తే (27శాతం) మగవాళ్లు (40శాతం) ఎక్కువగా సొంతంగా నిర్ణయాలను (ప్రొఫెషనల్ అడ్వైజర్ను సంప్రదించకుండా) తీసుకుంటున్నారు. ఇతరులతో కలిసి పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే విషయంలో మగవాళ్ల (48శాతం) కంటే మహిళలు (67శాతం) తమ జీవిత భాగస్వామిని ఎక్కువగా సంప్రదించారు. మహిళల (10శాతం) కంటే ఎక్కువ మంది మగవారు (26శాతం) పెట్టుబడి నిర్ణయాల కోసం తమ తండ్రితో మాట్లాడారు. తమ తండ్రుల (12శాతం) కంటే భర్తలు (21శాతం) మహిళల పెట్టుబడుల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. పెట్టుబడుల గురించి సొంతంగానే నేర్చుకుంటున్నామని మెజారిటీ మగవాళ్లు పేర్కొన్నారు ఎక్కువ శాతం మంది మగవాళ్లు తమ తండ్రి (పురుషులు 15శాతం, మహిళలు 12శాతం), స్నేహితుల ద్వారా (పురుషులు 18శాతం & మహిళలు11శాతం) ద్వారా పెట్టుబడుల గురించి నేర్చుకున్నామని చెప్పారు. రెస్పాండెంట్లలో 32శాతం మంది మహిళలు, 36శాతం మంది మగవాళ్లు ఫైనాన్షియల్ అడ్వైజర్ను సంప్రదించారు. చాలా మంది మగవాళ్లు (79శాతం) మహిళలు (78శాతం) ఆర్థిక సలహాదారుల విషయంలో ఆడామగా తేడాను పట్టించుకోలేదని చెప్పారు. పురుష అడ్వైజర్ దగ్గరికే వెళ్లామని మగవాళ్లు (15శాతం), మహిళలు (13శాతం) చెప్పారు. మహిళా ఆర్థిక సలహాదారులను మగవాళ్ల (6శాతం) కంటే మహిళలు (8శాతం) కొంచెం ఎక్కువగా ఇష్టపడుతున్నారు.
ఆలోచనల్లో మార్పు తెచ్చిన కరోనా
మరొక ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, చాలా మంది (దాదాపు 70శాతం మంది మగవాళ్లు, మహిళలు ) పెట్టుబడి పెట్టడం గురించి తమ కొడుకు, కుమార్తెలకు వేర్వేరుగా సలహాలు ఇస్తామని చెప్పారు. వాస్తవానికి, 41శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లల జెండర్ను బట్టి పెట్టుబడి వ్యూహం ఉంటుందని చెప్పారు. ఈ సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు సగం మంది (45శాతం) మగవాళ్లు, మహిళలు కరోనా తర్వాత ఎక్కువ పెట్టుబడి పెట్టినట్లు చెప్పారు. మహమ్మారి వల్ల డబ్బు విలువ తెలియడం, మునుపటి కంటే ఎక్కువ రాబడిని కోరుకోవడం , యాప్ల ద్వారా సులభంగా పెట్టుబడి పెట్టడం వంటివి ఇందుకు కారణాలు. ఇరువర్గాల పెట్టుబడి లక్ష్యాలు చాలావరకు ఒకే విధంగా ఉన్నాయి. జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, పదవీ విరమణ కోసం తగినంత ఆదా చేయడం, పిల్లల విద్య కోసం డబ్బు అందించడానికి డబ్బును పొదుపు చేస్తున్నారు. పురుషుల (40శాతం) కంటే ఎక్కువ మంది మహిళలు (45శాతం) పిల్లల విద్య...వారి ప్రధాన లక్ష్యాలలో ఒకటిగా పేర్కొన్నారు. అప్పులు లేని జీవితం ఉండాలని కొందరు (పురుషులు 38శాతం & మహిళలు 33శాతం), సొంత వెంచర్ను ప్రారంభించాలని మరికొందరు (పురుషులకు 26శాతం & మహిళలకు 23శాతం) చెప్పారు. సర్వేలో 10 నగరాలకు (4 మెట్రోలు: ముంబై, ఢిల్లీ, కోల్కతా, బెంగళూరు 6 మినీ మెట్రోలు: ఇండోర్, కొచ్చి, పాట్నా, చండీగఢ్, లూథియానా అమృత్సర్)కు చెందిన 4,625 మంది మహిళలు, మగవాళ్లు (25–- 60 ఏళ్ల వయస్సు) పాల్గొన్నారు. సర్వే కోసం ఫీల్డ్వర్క్ ఈ ఏడాది అక్టోబర్ నుంచి నవంబర్ 2022 వరకు జరిగిందని డీఎస్పీ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్కు చెందిన అదితి దేశాయ్ చెప్పారు.
సర్వేలో ముఖ్యాంశం ఏమిటంటే, మహిళలు తమ భర్తల ద్వారా పెట్టుబడులు మొదలుపెడతారు. పెట్టుబడులపై వాళ్లే ఎక్కువ గైడెన్స్ఇస్తారు. తల్లిదండ్రుల జోక్యం ఎక్కువగా ఉండదు. చిన్న వయస్సులోనే కూతుళ్లతో డబ్బులు పెట్టుబడి పెట్టడంపై మాట్లాడాలని నేను తల్లిదండ్రులకు ప్రత్యేకంగా చెప్తాను. దీనివల్ల కొత్తతరం వారి పెట్టుబడుల విషయం లో తెలివిగా ఉంటుంది. మహిళలు పర్సనల్ ఫైనాన్స్ ఫ్రొఫెషనల్స్ సలహాలు తీసుకోవాలి.
‑ అదితి కొఠారి దేశాయ్,
డీఎస్పీ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ (వీపీ)
