- 60% ఈక్విటీ + 30% సర్కారీ బాండ్స్ + 10% గోల్డ్
- మోస్తరు రిస్క్ తీసుకునేవారి కోసం మాత్రమే..
- మెజారిటీ ఎనలిస్టుల అభిప్రాయం ఇది
న్యూఢిల్లీ:
మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం వస్తోంది. గత ఏడాది కంటే ఈ సంవత్సరం బాగా సంపాదించాలని చాలా మంది అనుకుంటుంటారు. ఇందుకోసం ప్లాన్లు రెడీ కూడా చేసుకుంటుంటారు. ఎంతకీ ఏది మంచి ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ? ఒకే సైజు దుస్తులు అందరికీ ఫిట్ కానట్టే ఒకే తరహా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అందరికీ సరిపోదు. ఒక్కొక్కరి అవసరాలు, పొదుపు చేయగల సామర్థ్యం ఒక్కోలా ఉంటాయి. సరైన ‘అసెట్ మిక్స్’ గురించి ఎక్స్పర్టులు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి ఒక సంస్థ సర్వే నిర్వహించింది. మనదేశంలోని టాప్ ఫండ్ మేనేజర్లు, బ్రోకింగ్ కంపెనీల రీసెర్చ్ హెడ్లు ఇన్వెస్ట్మెంట్లకు ఈక్విటీలే బెస్ట్ అసెట్ క్లాస్ అని స్పష్టం చేశారు. కొత్త సంవత్సరంలో ఈక్విటీలపై మరింత దృష్టి సారించాలని రికమెండ్ చేశారు. మోస్తరు రిస్క్ తీసుకోగలిగే వాళ్లు తమ సంపద/ఆదాయంలో 60 శాతం వరకు ఈక్విటీల్లో, 10 శాతం గోల్డ్లో, 30 శాతం ప్రభుత్వ సెక్యూరిటీల వంటి డెట్ ఫండ్స్లో పెట్టాలన్నది వీళ్ల రికమండేషన్.
ప్రస్తుత సంవత్సరం మెజారిటీ ఈక్విటీ ఇన్వెస్టర్లు లాభపడ్డారనే చెప్పవచ్చు. సెన్సెక్స్ 15 శాతం పెరిగింది. బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ నాలుగు శాతం పడిపోగా, స్మాల్క్యాప్ ఇండెక్స్ తొమ్మిది శాతం పతనమయింది. విలువైన లోహాలు 20 శాతం రాబడిని ఇచ్చాయి. గత ఏడాది డిసెంబరు 31న పది గ్రాముల బంగారం ధర రూ.31,556 కాగా, ఈ నెల 24న దీని ధర రూ.38,297లకు చేరింది. ‘‘ఇన్వెస్ట్మెంట్ ప్లాన్/అసెట్క్లాస్పై నిర్ణయం తీసుకునేముందు ప్రతి ఒక్కరూ తమ రిస్క్ సామర్థ్యాన్ని సరిగ్గా అంచనా వేసుకోవాలి. ఈక్విటీ వంటి వాటిల్లో ఉండే నష్టాలకు సిద్ధపడాలి. ఒకటికి రెండుసార్లు ఆలోచించుకున్నాకే ఇన్వెస్ట్మెంట్ మొదలుపెట్టాలి’’ అని ఒక ఫైనాన్షియల్ సర్వీస్ కంపెనీ రీసెర్చ్ హెడ్ అన్నారు. మోస్తరుస్థాయి రిస్క్ తీసుకునే వాళ్లు 60 శాతం సంపదను స్టాక్ మార్కెట్లో పెట్టడం మంచిదేనని ఎమ్కే ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ సీఈఓ వికాస్ సచ్దేవా అన్నారు. ఇలాంటి వారికి ఈక్విటీ లార్జ్క్యాప్, మిడ్క్యాప్ షేర్లు బెటరని అన్నారు. మిగతా మొత్తం బంగారంపై ఇన్వెస్ట్ చేయవచ్చని చెప్పారు.
హౌసింగ్ లోన్కూ ప్రయత్నించవచ్చు
సొంతింటి కల ఉన్న వాళ్లు దాని కోసమూ ప్రయత్నం చేయవచ్చని, తక్కువ వడ్డీ రేట్లకే లోన్లు వస్తున్నాయని అన్నారు. ఇండియాలోని టాప్ నగరాల్లో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఇళ్ల ధరలు ఒకశాతం మాత్రమే పెరిగాయి. కోల్కతా, ఢిల్లీలో ధరలు మారలేదని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టంట్స్ రిపోర్ట్ తెలిపింది. పైగా నిలిచిపోయిన ఇళ్ల ప్రాజెక్టులను డెవెలపర్లు తిరిగి ప్రారంభించడానికి, ప్రభుత్వం వారి కోసం రూ.25 వేల కోట్ల స్ట్రెస్ఫండ్ను ప్రకటించింది. కోటక్ సెక్యూరిటీస్ ఫండమెంటల్ రీసెర్చ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రస్మిక్ ఓజా మాట్లాడుతూ మోస్తరు రిస్క్ తీసుకోవాలనుకునే వారు 40 శాతం ఈక్విటీల్లో, 50 శాతం డెట్లో, 10 శాతం గోల్డ్లో పెట్టాలని సూచించారు. ఈ ఏడాది జనవరి నుంచి బీఎస్ఈలోని 86 శాతం స్టాక్స్ ఇన్వెస్టర్లకు నష్టాలను తెచ్చాయి. కొన్ని స్టాక్స్ అయితే 99 శాతం పతనమయ్యాయి. డెట్ ఫండ్స్ 12 శాతం, గిల్ట్ ఫండ్స్ 11 శాతం దాకా లాభపడ్డాయి. అయితే కొత్త సంవత్సరంలో బెంచ్మార్క్ ఇండెక్స్లో రెండంకెల గ్రోత్ కనిపిస్తుందని, మిడ్క్యాప్ స్టాక్లు రికవరీ అవుతాయని ఎనలిస్టులు చెబుతున్నాయి. నిఫ్టీ 13,209 స్థాయిని, సెన్సెక్స్ 46,050 స్థాయిని తాకుతాయని చెబుతున్నారు.

