న్యూఢిల్లీ : వాయు కాలుష్యం కారణంగా ఢిల్లీ, ముంబైలో నివసిస్తున్న 60 శాతం మంది ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ఆలోచిస్తున్నట్లు ఓ సర్వేలో తేలింది. 10 మందిలో ఆరుగురు మకాం మార్చేందుకు సిద్ధంగా ఉన్నారని సర్వే రిపోర్టు వెల్ల డించింది. ఢిల్లీ, ముంబై నగరాలతో పాటు సమీపంలోని ప్రాంతాలకు చెందిన 4,000 మందిపై హెల్త్ కేర్ ప్రొవైడర్ ప్రిస్టిన్ కేర్ ఈ సర్వే నిర్వహించింది.
అక్కడ 10 మందిలో తొమ్మిది మంది నిరంతర దగ్గు, శ్వాసలోపం, గురక, గొంతు నొప్పి, దురద వంటి లక్షణాలను ఎదుర్కొంటున్నారని సర్వేలో తేలింది. గాలిలో నాణ్యత క్షీణించడం వల్లే ఈ ప్రభావం కనిపిస్తోందని వెల్లడించింది. 40 శాతం మందిలో ఈ వింటర్ సీజన్లో ఆస్తమా లేదా బ్రాన్కైటిస్ వంటి శ్వాసకోశ సమస్యలను గమనించారు.10 మందిలో నలుగురు ప్రతి సంవత్సరం వాయు కాలుష్యానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలపై ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని సర్వే రిపోర్ట్ పేర్కొంది.
ఈ టైంలో 35 శాతం మంది వ్యాయామం, రన్నింగ్ వంటి బహిరంగ కార్యకలాపాలను నిలిపివేసినట్లు సర్వేలో తేలింది. ఢిల్లీ, ముంబైలలో కేవలం 27 శాతం మంది ఎయిర్ ప్యూరిఫైయర్లను వాడుతున్నట్లు అంగీకరించారని, అయితే ఆశ్చర్యకరంగా 43 శాతం మంది ఇప్పటికీ "వాటి వాడకం రోగనిరోధక శక్తిని తగ్గిస్తుందనే అపోహను కలిగి ఉన్నారని" నివేదిక పేర్కొంది.
