- ముందువరుసలో తెలంగాణ సహా పలు రాష్ట్రాలు, యూటీలు
న్యూఢిల్లీ, వెలుగు: గ్రామీణ పారిశుద్ధ్య ప్రగతిలో భారత్ మరో మైలు రాయిని చేరింది. స్వచ్ఛభారత్ మిషన్ గ్రామీణ్ ఫేజ్–2 కింద దేశంలోని 50 శాతం గ్రామాలు బహిరంగ మలవిసర్జన రహిత (ఓడీఎఫ్ ప్లస్) జాబితాలో చేరాయని బుధవారం కేంద్రం వెల్లడించింది. ఘన, ద్రవ, వ్యర్థ పదార్థాల నిర్వహణ వ్యవస్థలు అమలు చేయడంతో పాటు ఓడీఎఫ్ రహితంగా మారిన గ్రామాలను ఓడీఎఫ్ ప్లస్ జాబితాలో చేర్చామని కేంద్ర జలవనరుల శాఖ పేర్కొంది.
ఇప్పటి వరకు 2.96 లక్షలకు పైగా గ్రామాలు స్వతంత్రంగా ఓడీఎఫ్ ప్లస్ సాధించాయని తెలిపింది. 2024–25 నాటికి స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ (ఎస్బీఎంజీ) దశ II లక్ష్యాలను సాధించే దిశగా ఇదో ముందడుగు అని పేర్కొంది. ఇందులో టాప్ పెర్ఫార్మింగ్ రాష్ట్రాల్లో తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, యూపీ కాగా.. కేంద్ర పాలిత ప్రాంతాలు గోవా, అండమాన్–నికోబార్ దీవులు, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ, లక్షద్వీప్ ఉన్నాయని పేర్కొంది. పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ (100 శాతం), కర్ణాటక(99.5 శాతం), తమిళనాడు (97.8 శాతం) ఉత్తరప్రదేశ్ (95.2 శాతం) చిన్న రాష్ట్రాల్లో గోవా (95.3 శాతం), సిక్కిం (69.2 శాతం) యూటీల్లో అండమాన్ నికోబార్ దీవులు, దాద్రానగర్ హవేలి– డామన్ డయ్యూ, లక్షద్వీప్ 100 శాతం గ్రామాలు ఓడీఎఫ్ ప్లస్ సాధించాయని పేర్కొంది.
