
పచ్చిమామిడికాయలతో ఎక్స్పరిమెంట్స్ చేసి ఉంటారు. మరి పండు మామిడితో ట్రై చేశారా? నేరుగా తింటాం, జ్యూస్లు తాగుతాం ఇంకేం చేస్తాం? అంటున్నారా. అట్లు, చపాతీలు, రైస్, కర్రీ... అంటూ బోలెడు వెరైటీలు చేసుకోవచ్చు. మరింకెందుకు ఆలస్యం... మ్యాంగోస్ సీజన్ అయిపోయేలోపు ఇవి ట్రై చేయండి.
మామిడి చపాతి చేయడం ఎలా..
కావాల్సినవి :
మామిడి పండు
ముక్కలు : ఒక కప్పు
మైదా లేదా
గోధుమ పిండి : ఒక కప్పు
ఉప్పు, వేడి నీళ్లు : సరిపడా
పచ్చికొబ్బరి : అర కప్పు
నెయ్యి : ఒక టేబుల్ స్పూన్
చక్కెర : పావు కప్పు
తయారీ :
ఒక గిన్నెలో మైదా లేదా గోధుమ పిండి, ఉప్పు వేసి కొన్ని నీళ్లు పోసి ముద్దగా కలపాలి. పచ్చి కొబ్బరి కూడా మెత్తగా మిక్సీపట్టాలి. ఆ తర్వాత మిక్సీ జార్లో మామిడి పండు ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఒక పాన్లో నెయ్యి వేడి చేసి, పచ్చి కొబ్బరి తురుము వేసి వేగించాలి. అందులో చక్కెర, మామిడి పండు గుజ్జు వేయాలి. తక్కువ మంట మీద ఉడికించాలి. మిశ్రమం దగ్గరపడ్డాక స్టవ్ ఆపేయాలి. ఈ మిశ్రమం చల్లారాక ఉండలు చేయాలి. మైదా పిండిని ఉండలు చేసి, చపాతీల్లా వత్తాలి. అందులో మామిడి మిశ్రమం పెట్టి మరోసారి వత్తాలి. ఆ తర్వాత వేడి పెనం మీద నెయ్యితో రెండు వైపులా కాల్చాలి.
మామిడి దోశె చేయడం ఎలా..
కావాల్సినవి :
మామిడి పండు ముక్కలు : ఒక కప్పు
బియ్యం (నానబెట్టిన) : ఒక కప్పు
మరమరాలు : ఒక కప్పు
చక్కెర లేదా బెల్లం : రెండు టేబుల్ స్పూన్లు
నీళ్లు, ఉప్పు : సరిపడా
సోడా ఉప్పు : పావు టీస్పూన్
యాలకుల పొడి : చిటికెడు
తయారీ :
నానబెట్టిన బియ్యం, మరమరాలు మిక్సీజార్లో వేసి గ్రైండ్ చేయాలి. తరువాత మామిడి పండు ముక్కలు, చక్కెర లేదా బెల్లం కూడా వేసి, కొన్ని నీళ్లు పోసి మరోసారి మిక్సీ పట్టాలి. ఈ మిశ్రమాన్ని గిన్నెలోకి తీసి అందులో ఉప్పు, సోడా ఉప్పు, యాలకుల పొడి వేసి కలపాలి. ఆ తర్వాత పాన్ మీద దోశెలా పోసి, మూత పెట్టి ఉడికించాలి. రెండు వైపులా కూడా తిప్పి కాల్చాలి. వీటిపై నెయ్యి వేసుకుని తింటే టేస్టీగా ఉంటాయి.
స్పైసీ గ్రిల్డ్ మ్యాంగో చేయడం ఎలా..
కావాల్సినవి :
జీడిపప్పులు (నానబెట్టిన) : అర కప్పు
ఎండు మిర్చి : ఒకటి
మామిడి పండ్లు : రెండు
నిమ్మరసం : పావు కప్పు
అల్లం తరుగు : రెండు టీస్పూన్లు
కొత్తిమీర : కొంచెం
ఉప్పు : సరిపడా
మిరియాలు : ఒక టీస్పూన్
తయారీ :
ఎండు మిర్చిని దంచి, పొడి చేయాలి. మామిడి పండును తొక్క తీసి సన్నని స్లైస్ల్లా కోయాలి. వాటికి రెండు వైపులా నూనె రాసి గ్రిల్ పాన్లో కాల్చాలి. ఆ తర్వాత నానపెట్టిన జీడిపప్పులు, నిమ్మరసం, అల్లం, మిర్చి పొడి వేయాలి. అందులో నీళ్లు పోసి గ్రైండ్ చేయాలి. గ్రిల్ చేసిన మామిడిపండుపైన మీకు నచ్చినట్టుగా వేసుకోవచ్చు. తర్వాత కొత్తిమీర, మిర్చి పొడి, మిరియాల పొడి, ఉప్పు చల్లాలి.
మ్యాంగో రైస్ చేయడం ఎలాగంటే
కావాల్సినవి : మామిడి పండు గుజ్జు: అర కప్పు,
బియ్యం (నానబెట్టి) : ఒక కప్పు, నీళ్లు: మూడు కప్పులు
నిమ్మరసం : ఒక టీస్పూన్, నెయ్యి : అర టీస్పూన్
బాదం, పిస్తా, జీడిపప్పు, ఎండు ద్రాక్ష : ఒక్కోటి పది చొప్పున
పుల్లటి పెరుగు : ఒక కప్పు, చక్కెర పొడి : రెండు టేబుల్ స్పూన్లు
యాలకుల పొడి : పావు టీస్పూన్. మామిడి పండు ముక్కలు : అర కప్పు
తయారీ :
ఒక గిన్నెలో నీళ్లు పోసి కాగబెట్టాలి. అవి మరిగాక అందులో నానబెట్టిన బియ్యం వేయాలి. అవి ఉడికేటప్పుడు, నెయ్యి, నిమ్మరసం వేసి కలపాలి. పాన్లో నెయ్యి వేడి చేసి బాదం, పిస్తా, జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసి ఒక్కోటి వేగించాలి. గంజివార్చి అన్నం వండాలి. ఒక గిన్నెలో పుల్లటి పెరుగు, మామిడి పండు గుజ్జు, చక్కెర పొడి, యాలకుల పొడి, వేగించిన బాదం, పిస్తా, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, మామిడి పండు ముక్కలు వేసి కలపాలి. అందులో అన్నం కలిపి దానిపైన వేగించిన నూనె పోయాలి. రెండు గంటలు ఫ్రిజ్లో పెట్టాక తింటే భలే రుచిగా ఉంటుంది.
పసిడి ముత్యాలు
కావాల్సినవి :
మామిడి పండు గుజ్జు : ముప్పావు కప్పు
కార్న్ ఫ్లోర్ : నాలుగు టేబుల్ స్పూన్లు
నీళ్లు : సరిపడా, చక్కెర : అర కప్పు
నిమ్మరసం, రోజ్ వాటర్ :ఒక్కో టీస్పూన్ చొప్పున
తయారీ :
మామిడి పండు గుజ్జును వడకట్టాలి. ఒక గిన్నెలో కార్న్ఫ్లోర్ వేసి అందులో కొన్ని నీళ్లు కలపాలి. ఒక పాన్లో వడకట్టిన మామిడి పండు గుజ్జు వేసి వేగించాలి. తర్వాత అందులో కార్న్ఫ్లోర్ కలిపిన నీళ్లు పోయాలి. మిశ్రమం దగ్గరపడేవరకు గరిటెతో కలుపుతూ ఉడికించాలి. కాస్త వేడి తగ్గాక ముద్ద చేసి పైన కార్న్ఫ్లోర్ చల్లి గోలీల్లా చేయాలి. ఒక గిన్నెలో నీళ్లు వేడి చేసి అందులో ఈ గోలీలు వేసి ఉడికించాలి. అవి బాగా ఉడికాక నీళ్లను వడకట్టాలి. ఉడికించిన గోలీలను చల్లటి నీళ్లలో వేయాలి. మరో గిన్నెలో కొన్ని నీళ్లు పోసి చక్కెర, నిమ్మరసం వేయాలి. అందులో ఈ మ్యాంగో గోలీలు వేయాలి. కాసేపు ఆ మిశ్రమంలో ఉడికించి తరువాత గాజు సీసాలోకి తీసి మూత పెట్టాలి. తయారుచేసిన పసిడి ముత్యాలను ఫ్రిజ్లో పెట్టి, చల్లారాక తింటే డెలిషియస్ డెజర్ట్ రెడీ.
మంగళూర్ మ్యాంగో కర్రీ
కావాల్సినవి :
మామిడి పండ్లు(చిన్నసైజ్) : ఎనిమిది
మిరియాలు, మెంతులు, ధనియాలు : ఒక్కో టీస్పూన్ చొప్పున
ఆవాలు, జీలకర్ర : ఒక్కోటి అర టీస్పూన్ చొప్పున
ఎండు మిర్చి : ఐదు
అల్లం : చిన్న ముక్క
వెల్లుల్లి రెబ్బలు : నాలుగు
ఉల్లిగడ్డ తరుగు : ముప్పావు కప్పు
నీళ్లు, ఉప్పు : సరిపడా
నూనె : రెండు టేబుల్ స్పూన్లు
కరివేపాకు : కొంచెం
పసుపు : అర టీస్పూన్
బెల్లం పొడి : రెండు టేబుల్ స్పూన్లు
చింతపండు రసం : రెండు టేబుల్ స్పూన్లు
తయారీ :
మిరియాలు, మెంతులు, ధనియాలు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, అల్లం, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిగడ్డ తరుగును ఒక మిక్సీ జార్లో వేయాలి. అందులో నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఒక పాన్లో నూనె వేడి చేసి కరివేపాకు వేగించాలి. అందులో మిక్సీ పట్టిన మిశ్రమం వేయాలి. అందులో పసుపు, ఉప్పు వేసి కలపాలి. ఆ తర్వాత నీళ్లు, చింత పండు రసం పోసి బెల్లం పొడి వేయాలి. చివరిగా తొక్క తీసిన మామిడి పండ్లు కూడా అందులో వేయాలి. పావుగంటసేపు ఉడికించాలి. ఈ స్పైసీ మ్యాంగో కర్రీని అన్నంలో కలుపుకుని తింటే టేస్ట్ అదిరిపోతుంది.