న్యూఢిల్లీ: మనదేశం నుంచి పోయిన నెలలో సరుకుల ఎగుమతుల విలువ 20.55 శాతం పెరిగి 38.94 బిలియన్ డాలర్లకు చేరుకుంది. వాణిజ్య లోటు రికార్డు స్థాయిలో 24.29 బిలియన్ డాలర్లకు ఎగిసిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అన్ని రకాల దిగుమతులు మే 2022లో 62.83 % పెరిగి 63.22 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. కిందటి ఏడాది ఇదే నెలలో వాణిజ్య లోటు 6.53 బిలియన్ డాలర్లుగా ఉంది. 2022-–23 ఏప్రిల్–-మే లో అన్ని ఎగుమతులు దాదాపు 25 % పెరిగి 78.72 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్-–మేలో దిగుమతులు 45.42 % పెరిగి 123.41 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లో వాణిజ్య లోటు 21.82 బిలియన్ డాలర్ల నుండి 44.69 బిలియన్ డాలర్లకు పెరిగింది. పోయిన నెల పెట్రోలియం, ముడి చమురు దిగుమతులు 102.72 % పెరిగి 19.2 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. 2021 మే నెలలో ఏడాది లెక్కన బొగ్గు, కోక్, బ్రికెట్ల దిగుమతులు 2 బిలియన్ డాలర్లకు నుండి 5.5 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ఇదేకాలంలో బంగారం దిగుమతులు 677 మిలియన్ డాలర్ల నుండి ఆరు బిలియన్ డాలర్లకు పెరిగాయి. మే నెలలో ఇంజినీరింగ్ వస్తువుల ఎగుమతులు 12.65% పెరిగి 9.7 బిలియన్ డాలర్లకు చేరుకోగా, పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు 60.87% పెరిగి 8.54 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. రత్నాలు, ఆభరణాల ఎగుమతుల విలువ 3.22 బిలియన్ డాలర్లుగా ఉంది.
