ఆగ్రా, న్యూఢిల్లీ: కరోనా ట్రీట్మెంట్ తీసుకుంటున్న పేషెంట్లకు ఆక్సిజన్ సప్లై కట్ చేసిందో ఆస్పత్రి.. మాక్ డ్రిల్ పేరుతో ఆక్సిజన్ ఆపేయడంతో 22 మంది పేషెంట్లు చనిపోయారు. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా సిటీలో ఈ దారుణం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి తాజాగా బయటపడింది. దీంతో యోగి సర్కారు విచారణకు ఆదేశించింది. ఆగ్రా సిటీలోని పరాస్ ఆస్పత్రి యాజమాన్యం ఏప్రిల్ 26న ఆక్సిజన్ మాక్ డ్రిల్ నిర్వహించింది. చికిత్స తీసుకుంటున్న కరోనా పేషెంట్లకు 5 నిమిషాల పాటు ఆక్సిజన్ సప్లై నిలిపేసింది. దీంతో కరోనా వార్డులో ఉన్న పేషెంట్లలో 22 మందికి ఆక్సిజన్ అందలేదు. వారి శరీరాలు నీలం రంగులోకి మారాయి. కాసేపయ్యాక ఆక్సిజన్ సప్లై ప్రారంభించినా ఆ పేషెంట్ల పరిస్థితి మెరుగుపడక, అంతా చనిపోయారు. అదే వార్డులో ఉన్న 74 మంది పేషెంట్లు మాత్రం బాగానే ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఓ వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చికిత్స తీసుకుంటున్న పేషెంట్లలో ఆక్సిజన్అవసరం ఎవరికి ఉందని తెలుసుకోవడానికి, వారికి మాత్రమే ఆక్సిజన్ అందించి ప్రాణాలు కాపాడేందుకే ఈ మాక్డ్రిల్ చేసినట్లు యాజమాన్యం చెప్పింది. ఏప్రిల్లో రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత ఉందని పేర్కొంది. ఈ మాక్ డ్రిల్లో 22 మంది పేషెంట్లు చనిపోయారనే వార్తలను మేనేజ్మెంట్ కొట్టిపారేసింది. ఆక్సిజన్ అందక తమ ఆస్పత్రిలో ఏ ఒక్క పేషెంటు కూడా చనిపోలేదని వివరించింది. ఈ ఘటనపై ఆగ్రా కలెక్టర్ స్పందిస్తూ.. ఏప్రిల్లో ఆక్సిజన్ కొరత లేదన్నారు. పేషెంట్ల మరణాలకు సంబంధించిన వీడియో తమ నోటీసుకు కూడా వచ్చిందని, ఘటనపై విచారణకు ఆదేశించామని చెప్పారు. ఆస్పత్రి ఓనర్పై పాండమిక్ యాక్ట్ కింద కేసు ఫైల్ చేసి, పరాస్ ఆస్పత్రిని సీజ్ చేసినట్లు కలెక్టర్ ప్రభు ఎన్ సింగ్ చెప్పారు.
