న్యూఢిల్లీ: మన దేశంలోని 20 కోట్ల మందికి ఒకే నెంబర్ నుంచి స్పామ్ కాల్స్ వచ్చాయిట. ఈ ఏడాది జనవరి–అక్టోబర్ మధ్యలోనే ఆ నెంబర్ నుంచి ఆ కాల్సన్నీ వచ్చాయని ట్రూకాలర్ తన గ్లోబల్ స్పామ్ రిపోర్టులో వెల్లడించింది. అంటే, రోజుకి 6,64,000 మందిని, గంటకు 27 వేల మందిని ఆ స్పామ్ కాల్స్ డిస్టర్బ్ చేశాయన్న మాట. టాప్ స్పామర్స్ను గుర్తించి ఆటోమేటిక్గా బ్లాక్ చేస్తుంటుంది ట్రూకాలర్. కానీ, ఏదోరకంగా ఈ టాప్ స్పామర్ ట్రూకాలర్ గురి నుంచి తప్పించుకుంటున్నట్లు పేర్కొంది. అంతేకాదు, దేశంలోని టెలికం ఆపరేటర్లు ఇన్ని కాల్స్ను చేయడానికి ఎలా ఒప్పుకున్నారోననే ఆశ్చర్యం వ్యక్తం చేసింది. మన దేశంలో ఎక్కువ స్పామ్ కాల్స్ సేల్స్, టెలిమార్కెటింగ్కి సంబంధించినవేనని ట్రూకాలర్ రిపోర్టు చెబుతోంది.కేవైసీ సాకుతో జనాలను కొల్లగొట్టే మోసగాళ్లు ఎక్కువయ్యారని, ఏదో ఒక విధంగా ఓటీపీలను చెప్పించుకుని వారు మోసాలకు పాల్పడతున్నారని తెలిపింది. ప్రతి మొబైల్ యూజర్ సగటున నెలకు 17 స్పామ్ కాల్స్ రిసీవ్ చేసుకుంటున్నాడని, ట్రూకాలర్ యూజర్లు ఒక్క అక్టోబర్ నెలలోనే 380 కోట్ల కాల్స్ రిసీవ్ చేసుకున్నారని వెల్లడించింది. స్పామ్ కాల్స్ విషయంలో అన్ని దేశాల కంటే బ్రెజిల్ ప్రపంచంలోనే ముందుందని ట్రూకాలర్ ఈ రిపోర్టులో పేర్కొంది.
