ఢిల్లీ : ఏపీలో పోలింగ్ నిర్వహించడంలో ఎన్నికల సంఘం విఫలమైందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఢిల్లీ కాన్ స్టిట్యూషన్ క్లబ్ లో ప్రతిపక్ష పార్టీల నాయకుల సామావేశంలో మాట్లాడారు. “ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించాలనేది మా డిమాండ్. 15 ప్రాంతీయ, 6 జాతీయ పార్టీలు మాకు మద్దతుగా నిలిచాయి. ఎలాంటి పరిశీలన లేకుండా లక్షలాది ఓటర్లను తొలగిస్తున్నారు. ఎన్నికల విశ్వసనీయత ప్రశ్నార్థకంగా మారింది” అని తెలిపారు చంద్రబాబు.
ఈ మీటింగ్ లో చంద్రబాబుతో పాటు, కేజ్రీవాల్, కాంగ్రెస్ నేతలు కపిల్ సిబల్, అభిషేక్ మను సింగ్వి సేవ్ డెమోక్రసీ , సేవ్ నేషన్ , పాల్గొని EVMల పని తీరుపై చర్చించారు. “అనేక చోట్ల సమస్యలు ఏర్పడ్డాయి. ఓటు వేయడానికి ప్రజలు గంటల తరబడి క్యూలో నిలబడాల్సివచ్చింది. చాలా దేశాల్లో ఈవీఎంల బదులు పేపర్ బ్యాలెట్ పోలింగ్నే నిర్వహిస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం భారత్ లోనూ పేపర్ బ్యాలెట్ పోలింగ్నే నిర్వహించాలని కోరుతున్నాం. రూ. 9వేల కోట్లు ఖర్చు పెట్టి వీవీప్యాట్ లు కొన్నారు.
అంత ఖర్చు పెట్టి ఒక్క వీవీప్యాట్ లో స్లిప్పులు లెక్కించడం ఏంటీ?. ఈవీఎంల పనితీరుపై చాలా సందేహాలున్నాయి. వీవీపాట్ లో గుర్తు 7 సెకండ్లు ఉండాల్సి ఉండగా.. మూడు సెకండ్లు మాత్రమే కనిపించింది. సమయం ఎందుకు మారిందంటే ఈసీ దగ్గర సమాధానం లేదు. ఎన్నికల నిర్వహణలో కేంద్రం, కేంద్ర ఎన్నికల సంఘం తీరు సంతృప్తికరంగా లేదు. సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసేందుకు ఆలోచిస్తున్నాం. 50 శాతం వీవీప్యాట్ లు లెక్కించాలని” ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.
