మిలియన్ డాలర్ సీఈవో క్లబ్లోకి కొత్తగా 22 మంది
ఈఎంఏ పార్టనర్స్ స్టడీ వెల్లడి
సీఈవో సగటు ప్యాకేజీ రూ.16.8 కోట్లు
క్లబ్లో కొత్తగా చేరిన ఇన్ఫోసిస్ సీఈవో
ముంబై: ఓ వైపు ఎకానమీ పడిపోతున్నా.. మరోవైపు కోట్ల కొద్దీ జీతం ఆర్జించే వారు ఇండియాలో పెరుగుతూనే ఉన్నారు. ‘మిలియన్ డాలర్ సీఈవో క్లబ్’లోకి 2018–19 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 22 మంది వచ్చి చేరారు. ఏడాదికి మిలియన్ డాలర్(రూ.7 కోట్ల) జీతం పొందే సీఈవోలు 2018 ఆర్థిక సంవత్సరంలో 124 మంది ఉంటే.. 2019 ఆర్థిక సంవత్సరంలో 146 మందికి పెరిగారు. అంటే అంతకుముందు ఏడాది కంటే వీరు 18 శాతం పెరిగినట్లు. ఓ వైపు రూపాయి విలువ పడిపోతున్నా.. గత నాలుగేళ్లలో ఈ జాబితాలోని సీఈవోల సంఖ్య ఈ మేర పెరగడం విశేషం. 2016 ఆర్థిక సంవత్సరంలో 119 మంది, 2017లో 120 మంది మాత్రమే మిలియన్ డాలర్ సీఈవోల క్లబ్లో ఉన్నారు. బీఎస్ఈ 200 కంపెనీల్లో సీఈవో, సీఎక్స్ఓల జీత, భత్యాలపై ఈఎంఏ పార్టనర్స్ జరిపిన వార్షిక అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. మిలియన్ డాలర్ సీఈవో క్లబ్లోని సభ్యులకు చెల్లించిన మొత్తం వేతనం కూడా 2019 ఆర్థిక సంవత్సరంలో14 శాతం పెరిగి రూ.2,457 కోట్లకు చేరింది. ఇది అంతకుముందు ఏడాది రూ.2,158 కోట్లుగా ఉంది. ఈ లిస్ట్లోని సీఈవో సగటు ప్యాకేజ్ రూ.16.8 కోట్లుగా ఉన్నట్టు ఈఎంఏ పార్టనర్స్ పేర్కొంది. ఈఎంఏ పార్టనర్స్ జరిపిన ఈ స్టడీలో అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి విలువ రూ.70గా తీసుకుంది. దీంతో 2019 ఆర్థిక సంవత్సరంలో వార్షిక జీత, భత్యాల కటాఫ్ రూ.7 కోట్లుగా ఉంది. రూ.7 కోట్లకు పైన జీతం పొందే వారిని ఈ జాబితాలో చేర్చారు. ఈ ఏడాది కొత్తగా మిలియన్ డాలర్ సీఈవో క్లబ్లో చేరిన వారు 22 మంది.
ఈ క్లబ్లోని ప్రముఖ సీఈవోలు….
మిలియన్ డాలర్ సీఈవో క్లబ్లో ఉన్న ప్రముఖ ప్రమోటర్లు, ప్రొఫెషనల్ సీఈవోల్లో సన్ గ్రూప్ ఛైర్మన్ కళానిధి మారన్ ఉన్నారు. గ్రూప్ను లీడ్ చేస్తున్నందుకు ఈయనకు 2019 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన మొత్తం రూ.88 కోట్లుగా ఉంది. హీరో మోటోకార్ప్ సీఎండీ పవన్ ముంజాల్ రూ.80 కోట్లు, జేఎస్డబ్ల్యూ స్టీల్ ఛైర్మన్ సజ్జన్ జిందాల్ రూ.69 కోట్లు, ఎల్ అండ్ టీ సీఈవో, ఎండీ ఎన్ సుబ్రమణియన్ రూ.27 కోట్లు, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ వీసీ అండ్ ఎండీ జగన్ బంగా రూ.16 కోట్లు, నెస్లే ఇండియా సీఎండీ సురేష్ నారాయణన్ రూ.11 కోట్లు, మ్యారికో ఎండీ, సీఈవో సౌగత్ గుప్తాకు రూ.9 కోట్లు ప్యాకేజీలు అందాయి. ఈ క్లబ్లో చేరిన కొత్త వారిలో ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ ఉన్నారు. ఈయన జీత, భత్యాలు 2018–19లో 300 శాతానికి పైగా పెరిగి రూ.17 కోట్లను అందుకున్నారు. అంతకుముందు ఏడాది పరేఖ్ కేవలం రూ.4 కోట్ల వేతనం మాత్రమే ఆర్జించారు.
ప్రొఫెషనల్ సీఈవోలే 85 మంది….
ఈ సారి లిస్ట్లో ప్రమోటర్ సీఈవోలు 61 మంది ఉంటే, ప్రొఫెషనల్ సీఈవోలు 85 మంది ఉన్నారు. అంటే ప్రమోటర్ సీఈవోలే కంటే ప్రొఫెషనల్ సీఈఓలే ఎక్కువ మంది ఉన్నట్టు ఈఎంఏ పార్టనర్స్ గుర్తించింది. ఇండియాలో మంచి సీఈవోలను నియమించుకోవడం చాలా కష్టంగా ఉందని ఈఎంఏ పార్టనర్స్ రీజనల్ మేనేజింగ్ పార్టనర్(ఏషియా) కే సుదర్శన్ చెప్పారు. ఎకానమీ ప్రస్తుతం స్లోడౌన్ను ఎదుర్కొంటోందని, ఇది సీఈవోలకు ఇచ్చే బోనస్లు, కమిషన్లపై ప్రభావం చూపిస్తుందని సుదర్శన్ అన్నారు. స్లోడౌన్ రియల్ ఎఫెక్ట్ 2020 ఆర్థిక సంవత్సరంలోని సీఈవోలు ఆర్జించే వేతనాలపై కనిపిస్తుందని పేర్కొన్నారు. అయితే గత కొన్నేళ్లుగా, సీఈవోలు ఆర్జించే వేతనాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కొన్ని కంపెనీల సీఈవో జీతాల్లో ఎలాంటి మార్పులు లేకపోగా.. అపోలో టైర్స్ ఓంకార్ కన్వర్ లాంటి కొంతమంది సీఈవోల వేతనాలు భారీగా పడిపోయాయి.
వాల్యు క్రియేట్ చేసేలా ఉండాలి…
మ్యాగీ కొన్నేళ్ల క్రితం ఎదుర్కొన్న సంక్షోభం నుంచి బయటపడేసిన నెస్లే ఇండియా సీఎండీ సురేష్ నారాయణన్ మాత్రం తాను కేవలం శాలరీ కోసం మాత్రమే పనిచేయడం లేదని స్పష్టం చేశారు. సీఈవో స్థాయికి వచ్చిన తర్వాత, మిమ్మల్ని పనిచేసేలా ప్రోత్సహించే మరికొన్ని అంశాలు కూడా ఉంటాయన్నారు. తన అభిప్రాయం ప్రకారం, జీతం చెల్లింపు అనేది, సవాళ్లను, క్లిష్టతను, బాధ్యతను, జవాబుదారీ తనాన్ని మేనేజ్ చేసే స్కిల్స్ను ప్రతిబింబిస్తుందన్నారు. ఇండియాలో పబ్లిక్ లిస్టెడ్ కంపెనీల్లో పాలన బాధ్యతలు కాస్త ఎక్కువగా ఉంటాయన్నారు. ఆర్గనైజేషన్స్ అంచనాలను సీఈవోలు అందుకోవాలని సూచించారు. మొత్తంగా చెప్పాలంటే, మీరు సీఈవో కావాలనుకుంటే, ఆర్గనైజేషన్కు కూడా వాల్యును క్రియేట్ చేసేలా ఉండాలన్నారు. దీన్ని కొలిచే దానిలో ఒకటి ఇన్వెస్టర్లకు డెలివరీ చేసే షేరు ధర అని పేర్కొన్నారు. కేవలం శాలరీని జేబులో వేసుకుని వెళ్లడమే కాకుండా.. కనీసం కొంతమందికి వాల్యును క్రియేట్ చేసేలా ఉండాలని పిలుపునిచ్చారు.
జాబితాలో కేవలం 2 శాతం మందే మహిళా సీఈవోలు..
కాగా, మిలియన్ డాలర్ సీఈవో క్లబ్లోని మహిళల సంఖ్య ఆశ్చర్యపోయేంత ఎక్కువేమీ లేదని సుదర్శన్ అన్నారు. టాప్లో ఉన్న ఆడవారు తక్కువ మంది ఉన్నారన్నారు. ఈ ఏడాది కేవలం 2 శాతం మంది ఉమెన్ సీఈవోలు మాత్రమే మిలియన్ డాలర్ సీఈవోల జాబితాలో చోటు దక్కించుకున్నట్టు చెప్పారు.
ఆర్గనైజేషన్స్ అంచనాలను సీఈవోలు అందుకోవాలి. మొత్తంగా చెప్పాలంటే, మీరు సీఈవో కావాలనుకుంటే, ఆర్గనైజేషన్కు కూడా వాల్యు క్రియేట్ చేసేలా ఉండాలి. సీఈవో పడే కష్టం ఆ కంపెనీ షేరు ధరలో కనిపిస్తోంది.
– సురేష్ నారాయణన్, సీఎండీ, నెస్లే ఇండియా

