12 మంది బీజేపీ ఎమ్మెల్యేలపై ఏడాది పాటు సస్పెన్షన్

12 మంది బీజేపీ ఎమ్మెల్యేలపై ఏడాది పాటు సస్పెన్షన్

మహారాష్ట్ర రాజకీయాల్లో ఇవాళ(సోమవారం) కీలక పరిణామం జరిగింది. ఏకంగా 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలను సంవత్సర కాలం పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు. స్పీకర్ చాంబర్లో ప్రిసైడింగ్ అధికారి భాస్కర్ జాదవ్ తో బీజేపీ ఎమ్మెల్యేలు అనుచితంగా ప్రవర్తించారని ప్రభుత్వం ఆరోపించింది. ఈ  కారణంగానే వారిపై సస్పెన్షన్ వేటు వేసినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 12 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నట్టు తీసుకువచ్చిన తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం లభించింది. బీజేపీ ఎమ్మెల్యేలు సంజయ్ కుటే, ఆశిష్ షేలార్, అభిమన్యు పవార్, గిరీశ్ మహాజన్, అతుల్ భట్కాల్కర్, పరాగ్ అల్వానీ, హరీశ్ పింపాలే, రామ్ సత్పుతే, విజయ్ కుమార్ రావల్, యోగేశ్ సాగర్, నారాయణ్ కుచే, కీర్తికుమార్ బంగ్దియాలపై ఈ సస్పెన్షన్ వేటు పడింది.

రెండు రోజుల వర్షాకాల సమావేశాల కోసం మహారాష్ట్ర అసెంబ్లీ సోమవారం సమావేశం అయ్యింది. మొదటి రోజే వాడీవేడి పరిణామాలు చోటుచేసుకున్నాయి. అయితే ఆ గొడవ సమయంలో అసెంబ్లీలోనే ఉన్న ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్ మాత్రం ఇవన్నీ తప్పుడు ఆరోపణలని కొట్టిపారేశారు. లేని స్టోరీని క్రియేట్ చేశారని.. బీజేపీ తరఫున ఎవరూ ఇలాంటి పనికి పాల్పడలేదని ఫడ్నవీస్ మీడియాకు చెప్పారు. ఓబీసీ రిజర్వేషన్ల కోసం తాము 12 మంది ఎమ్మెల్యేలను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.