- చిన్న ఇన్వెస్టర్లకు జెరోధా నిఖిల్ సలహా
- ఏ షేరు దొరికితే ఆ షేరు కొనొద్దు
- సొంతంగా రీసెర్చ్ చేయండి..
- ఇక నుంచి మార్కెట్ను కదిలించేవి సైక్లికల్, సీజనల్ షేర్లే
బిజినెస్ డెస్క్, వెలుగు: బడ్జెట్ రోజు దగ్గర పడుతోంది. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లు బడ్జెట్ రోజు ఎక్కువ వోలటాలిటీతో ట్రేడవుతుంటాయి. ఈ బిగ్ డే ముందు చిన్న ఇన్వెస్టర్లు ఎలా నిర్ణయాలు తీసుకోవాలో జెరోధా ఫౌండర్ నిఖిల్ కామత్ సలహాయిచ్చారు. ఇన్వెస్టర్లు జాగ్రత్త వహించాలని చెప్పారు. ఏ షేరు పడితే ఆ షేరులో ఇన్వెస్ట్ చేయొద్దని, సొంతంగా రీసెర్చ్ చేయాలని అన్నారు. ఇప్పటికే దేశ మార్కెట్లు బాగా పెరిగాయని, దీనికి తోడు ఇన్ఫ్లేషన్ భయాలు ఉన్నాయి కాబట్టి షేర్లను ఎంచుకునేటప్పుడు జాగ్రత్త పడాలని పేర్కొన్నారు. సెన్సెక్స్, నిఫ్టీలు శుక్రవారం సెషన్లో నష్టాలను తగ్గించుకొని ఫ్లాట్గా ముగిశాయి. ఈ ఇండెక్స్లు ఈ ఏడాది నష్టాల్లో క్లోజవ్వడం ఇది రెండోసారి మాత్రమే. ఇక నుంచి మార్కెట్ పెరుగుదల సీజనల్, సైక్లికల్ షేర్లపై ఎక్కువగా ఆధారపడుతుందని నిఖిల్ కామత్ అభిప్రాయపడ్డారు. ముందులా కాకుండా ఈ సారి మార్కెట్ కదలికలో తేడా ఉంటుందని, ఇన్వెస్టర్లు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పారు. ‘ సొంతంగా రీసెర్చ్ చేయండి. మార్కెట్లో లాంగ్ టెర్మ్ కోసం నిర్ధిష్టమైన షేర్లలో ఇన్వెస్ట్ చేయండి’ అని కామత్ సలహాయిచ్చారు.
లిస్టింగ్ రూల్స్ సింపుల్గా ఉండాలి..
విదేశాల్లో లిస్టింగ్ అవ్వడానికి రూల్స్ను సులభం చేయాలని చాలా కంపెనీలు ప్రభుత్వాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం కూడా ఫారిన్లో లిస్టింగ్ అయ్యేందుకు రూల్స్ను సింపుల్ చేస్తామని 2020 లోనే ప్రకటించింది. ఈ అంశంపై నిఖిల్ కామత్ స్పందించారు. మొదట దేశంలోని లిస్టింగ్ రూల్స్ను సులభం చేయాలని, లిస్టింగ్ అయ్యాక రూల్స్ను పాటించని కంపెనీలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ‘కంపెనీలు మార్కెట్లో లిస్టింగ్ అవ్వడంలో అనేక అడ్డంకులున్నాయి. కానీ, ఒకసారి లిస్టింగ్ అయ్యాక రూల్స్ను పాటించని కంపెనీలపై మాత్రం చర్యలు కఠినంగా లేవు. ఇది ఇన్వెస్టర్లను, ముఖ్యంగా చిన్న ఇన్వెస్టర్లను డేంజర్లో పడేస్తోంది’ అని ఈటీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నిఖిల్ కామత్ పేర్కొన్నారు.
క్రిప్టోలపై బడ్జెట్లో ఏం ఉండకపోవచ్చు, కానీ..
క్రిప్టో బిల్లును సపరేట్గా తీసుకురావాలని ప్రభుత్వం చూస్తున్న విషయం తెలిసిందే. దీంతో రానున్న బడ్జెట్లో క్రిప్టోకరెన్సీలకు సంబంధించి ఏం ఉండకపోవచ్చని నిఖిల్ కామత్ అభిప్రాయపడ్డారు. ఒకవేళ ఉంటే మాత్రం క్రిప్టో కరెన్సీలను ప్రభుత్వం ఎటువంటి అసెట్లుగా గుర్తిస్తుంది?, ఈ ఇండస్ట్రీలో ట్యాక్స్ సిస్టమ్ ఎలా ఉంటుంది? అనే అంశాలపై క్లారిటీ ఇవ్వాలని అన్నారు. దేశ ద్రవ్యలోటుపై కామత్ మాట్లాడారు. ‘ దేశంలో ప్రొడక్టివిటీని పెంచేందుకు, ఎకానమీని గాడిలో పెట్టేందుకు ఇన్ఫ్లేషన్ను కంట్రోల్లో ఉంచుతూనే ప్రభుత్వం సరిగ్గా ఖర్చు చేయగలగాలి. అలా అయితే ప్రస్తుతం ఉన్న ద్రవ్యలోటు గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ట్యాక్స్ కట్టేవాళ్లు పెరిగితే ఈ ద్రవ్యలోటును తగ్గించుకోవచ్చు’ అని నిఖిల్ కామత్ అన్నారు. ఒకవేళ దేశ ఎకానమీ 7–8 శాతం మేర వృద్ధి చెందకపోతే, ద్రవ్యలోటును కట్టడి చేసేందుకు కఠినమైన రూల్స్ను చూడొచ్చని పేర్కొన్నారు. కాగా, 2021-–22 ఆర్థిక సంవత్సరంలో దేశ ద్రవ్యలోటు జీడీపీలో 6.6 శాతంగా ఉంటుందని మెజార్టి రేటింగ్ కంపెనీలు అంచనావేస్తున్నాయి. 2020–21 లో ఇది జీడీపీలో 9.3 శాతంగా ఉండడం గమనించాలి.
ఎస్టీటీ తొలగించాలి..
లాంగ్ టెర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (ఎల్టీసీజీ), షార్ట్ టెర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (ఎస్టీసీజీ) ట్యాక్స్లు రెండూ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (ఎస్టీటీ) ని తొలగించాలని కామత్ కోరారు. ఒకవేళ ప్రభుత్వం ఎస్టీటీని కొనసాగించాలనుకుంటే , లాంగ్ టెర్మ్ క్యాపిటల్ గెయిన్స్పై ట్యాక్స్ను తొలగించాలని అన్నారు. ‘ఎల్టీసీజీని తీసేయడం వలన తగ్గిన ఆదాయాన్ని ఎస్టీటీ ద్వారా పెరిగిన రెవెన్యూతో భర్తీ చేయొచ్చు’ అని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఎస్టీటీ, ఎల్టీసీజీలలో మార్పులు తీసుకొస్తే ఎకానమీకి ఉపయోగపడుతుందని చెప్పారు. బడ్జెట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్పై క్యాపెక్స్ ఎక్కువగా ఉండాలని కామత్ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది చాలా అవసరమని చెప్పారు. జీడీపీలో అగ్రికల్చర్ సెక్టార్ వాటా ఎక్కువ. ఈ సెక్టార్లో లాజిస్టిక్స్, అగ్రీటెక్ వంటి ఇనీషియేటివ్లను ప్రోత్సహించేందుకు ఫైనాన్స్ మినిస్టర్ ఎటువంటి చర్యలను ప్రకటిస్తారో చూడాలని ఉందని చెప్పారు. అంతేకాకుండా రిన్యూవబుల్ ఎనర్జీ, ఈవీ వంటి సెక్టార్లలో సెంటిమెంట్ పెంచేందుకు ఎటువంటి చర్యలను తీసుకొస్తున్నారో చూడాలని ఉందన్నారు. చిన్న కంపెనీలు కూడా ఈ సెక్టార్లలో పార్టిసిపేట్ చేయగలిగేలా బడ్జెట్లో చర్యలు ఉండాలని అన్నారు.
