ఇవాళ్టి(నవంబర్ 6) నుంచే సమగ్ర సర్వే .. ఏ రోజుకారోజు ఆన్​లైన్​లో ఎంట్రీ

ఇవాళ్టి(నవంబర్ 6) నుంచే సమగ్ర సర్వే .. ఏ రోజుకారోజు ఆన్​లైన్​లో ఎంట్రీ
  • సర్వేలో 85 వేల మంది ఎన్యుమరేటర్లు, 8,500 మంది సూపర్​వైజర్లు
  • ముందే ఏ రోజు ఏ ఇంటికి వస్తారనే సమాచారం 
  • సాధారణ రోజుల్లో మధ్యాహ్నం.. సెలవుల్లో ఉదయం నుంచే సర్వే

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇంటింటి కుల గణన సర్వే బుధవారం నుంచి మొదలు కానున్నది.  ఇప్పటికే ఇంటింటికీ స్టిక్కర్లను అంటించిన అధికారులు.. వారికి కేటాయించిన ఇండ్లకు వెళ్లి, పూర్తి వివరాలను సేకరించనున్నారు. ఎన్యుమరేటర్లలో ప్రైమరీ స్కూళ్ల టీచర్లు, నాన్​ టీచింగ్​ సిబ్బంది ఎక్కువగా ఉండడంతో ప్రతి రోజూ మధ్యాహం 2 గంటల నుంచి సర్వే చేస్తారు. సెలవు రోజుల్లో ఉదయం కూడా కుల గణన సర్వే చేయనున్నారు.  వివిధ వర్గాల ప్రజల సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తగా నమోదు చేయనున్నారు. ఏ ఇంటికి ఎప్పుడు ఎన్యుమరేటర్​ వస్తారనే విషయం ముందుగానే తెలియజేస్తారు. దీంతో ఆయా కుటుంబాలకు సంబంధించిన పెద్దలు లేదా ఎవరు అందుబాటులో ఉంటే వాళ్లు ఇంటి సభ్యులకు సంబంధించిన పూర్తి సమాచారంతో సిద్ధంగా ఉండాలి


ఇంట్లో ఎంతమంది ఉంటారు? ఏం చేస్తారు? అనే దగ్గర నుంచి కులం, ఉప కులం, భూమి, సంపాదన, గొర్రెలు, బర్రెలు, అప్పులు, ఆదాయం, రాజకీయ పోస్టుల్లో ఉన్నారా ? ఏమైనా పదవుల్లో పనిచేశారా? అనే ప్రశ్నలకు సమాధానాలు సేకరించి, ఆ వివరాలన్నింటినీ ఫామ్​లో నమోదు చేస్తారు. అందరి ఆధార్​ కార్డు నంబర్లు తీసుకుంటారు. కుల గణన సర్వే ఫామ్​లో పార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–1లో యజమాని, కుటుంబ సభ్యుల వ్యక్తిగత వివరాలకు సంబంధించి 58 ప్రశ్నలు, పార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బీ లో కుటుంబ వివరాలకు సంబంధించి 17 ప్రశ్నలు ఉంటాయి. సమాచారం పూర్తిగా కచ్చితత్వంతో ఉండాలని, తప్పులు, అబద్ధాలు చెప్పకూడదని అధికారులు ప్రతి ఇంటికి స్పష్టం చేయనున్నారు. 

పకడ్బందీగా సర్వే

రాష్ట్రవ్యాప్తంగా 85 వేల మంది ఎన్యుమరేటర్లు, 8,500 మంది పరిశీలకులు (సూపర్​ వైజర్లు) ఇంటింటి సర్వే చేస్తారు. గ్రేటర్ పరిధిలో సర్వే చేపట్టేందుకు 21 వేల మంది ఎన్యుమరేటర్లను వినియోగించుకుంటున్నారు.  సర్వేను పకడ్బందీగా చేపట్టేందుకు ప్రతి 10 మంది ఎన్యుమరేటర్లకు ఒక్కో సూపర్ వైజర్​ను నియమించారు.  ప్రతి 150 కుటుంబాలకు ఒక ఎన్యుమరేటర్​ ఉండనున్నారు.   కుల గణన సర్వే సమాచార సేకరణ, డేటా ఎంట్రీ  ఈ నెల 30 వరకు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. ఇప్పటికే సిబ్బందికి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మాస్టర్ ట్రైనింగ్ పూర్తి అయ్యింది. ఈ శిక్షణ తీసుకున్న వారంతా జిల్లాల్లో ఇతర సిబ్బందికి అవగాహన కల్పించారు. కులగణన పూర్తి చేసి.. ఆ వివరాలను కంప్యూటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పొందపరుస్తారు. ఏ రోజు వివరాలను ఆ రోజే ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నమోదు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాల కలెక్టర్లు ఈ బాధ్యతలను పర్యవేక్షించనున్నారు. రిజర్వేషన్లు సక్రమంగా అమలు కావాలంటే ఏ కులం వారు ఎందరు ఉన్నారన్న లెక్క తేలాలి. 2023 తెలంగాణ ఎన్నికలకు ముందు బీసీ డిక్లరేషన్ పేరుతో కామారెడ్డిలో సభ పెట్టిన కాంగ్రెస్ పార్టీ.. బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్స్​ కల్పిస్తామని హామీ ఇచ్చింది. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం కుల గణన చేస్తున్నది. హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులకు తగ్గట్టుగా తాజాగా డెడికేటెడ్​ కమిషన్ ను కూడా ఏర్పాటు చేసింది. 
  
ఈ వివరాలూ సేకరిస్తరు..

సర్వేకు వచ్చిన ఎన్యుమరేటర్లు కుటుంబానికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తారు. తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు లేదా దేశం వెళ్తే..  వలస వెళ్లడానికి గల కారణాలను కూడా తెలియజేయాలి. ఒకవేళ వేరే రాష్ట్రాల నుంచి వలస వచ్చి ఇక్కడ నివాసం ఉంటే కూడా ఆ వివరాలు ఇవ్వాలి.  కుటుంబ సభ్యుల విద్యార్హతలు. - వార్షిక ఆదాయం, బ్యాంకు వివరాలు చెప్పాల్సి ఉంటుంది. గత ఐదేండ్లలో రుణాలు తీసుకున్న వారు రుణం తీసుకోవడానికి గల కారణాలు చెప్పాలి.  రాష్ట్రంలో ఎంతమందికి సొంత ఇండ్లు ఉన్నాయి? ఎంతమంది అద్దె ఇండ్లలో ఉంటున్నారు?  అనే విషయం అర్థం చేసుకోవడానికి గృహ నిర్మాణానికి సంబంధించిన వివరాలు తెలియజేయాలి. ఇంటి రకం, గదుల సంఖ్య, ఓనర్లా? లేదా అద్దెకు తీసుకున్నారా? అనే వివరాలు చెప్పాల్సి ఉంటుంది. కుటుంబం దగ్గర ఎన్ని వాహనాలు ఉన్నాయి? అనే దానితోపాటు ఇతర ఆస్తుల వివరాలను కూడా తెలియజేయాలి.  రాష్ట్రంలో కులాంతర వివాహాలు చేసుకున్నవారి వివరాలు కూడా తెలుసుకుంటారు.  కులాంతర వివాహాలకు లేదా ఇతర కులాల ఫంక్షన్లకు ప్రజలను ఆహ్వానించారా? అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రత్యేక కాలమ్ కూడా ఉంది. ఇప్పటికీ మాన్యువల్ స్కావెంజింగ్ జాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో నిమగ్నమై ఉంటే తప్పనిసరిగా ఎన్యుమరేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి అదే చెప్పాల్సి ఉంటుంది.