Gandhi Jayanti: రాజ్ఘాట్లో బాపూజీకి రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ నివాళి

ఢిల్లీ: గాంధీ జయంతి సందర్భంగా భారత జాతిపిత మహాత్మా గాంధీకి రాజ్ఘాట్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. మహాత్మా గాంధీ 155వ జయంతి సందర్భంగా బాపూజీ సేవలను గుర్తుచేసుకున్నారు. ప్రపంచానికి పరిచయమక్కరలేని పేరు గాంధీజీ. భారతీయులకు ఆయన మహాత్ముడు, జాతిపిత, స్ఫూర్తిప్రదాత. కులమతాలు, ఆచారవ్యవహారాలు, భాషాభేదాలు.. అన్నింటినీ మరిచి స్వేచ్ఛ, స్వాతంత్ర్యం కోసం కోట్లాది ప్రజలు ఒక్కతాటిపై నడిచేలా చేసిన వ్యక్తి. ముందుండి నడిపించిన శక్తి. దానికోసం ఆయన పడిన కష్టాలు, పాటించిన విలువలు చరిత్రలో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి. అలాంటి మహనీయుడి 155వ జయంతి నేడు.

ALSO READ | హైడ్రా పేరుతో కాంగ్రెస్ డ్రామాలు .. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపణ

గాంధీజీ సిద్ధాంతాలు, ఆదర్శాలు ఎంతో మందిని ప్రభావితం చేశాయి. అందుకే ఆయన్ని అభిమానించేవాళ్లు ప్రపంచమంతా ఉన్నారు. వాళ్లలో మార్టిన్​ లూథర్​ కింగ్​ జూనియర్(అమెరికా)​, నెల్సన్​మండేలా(దక్షిణాఫ్రికా), కొరియన్​ గాంధీగా పేరు పొందిన చొ మన్​–సిక్​(దక్షిణకొరియా), హో చి మిన్​(వియత్నాం) మొదలుకొని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్​ ఒబామా వరకు ఎంతో మంది గొప్ప నాయకులు ఉన్నారు. వీళ్లు అంతలా గాంధీజీని అభిమానించడానికి కారణం ఆయన వ్యక్తిత్వమే. అయితే, గాంధీజీ గొప్ప వ్యక్తిగా మారడం వెనక కొంతమంది ఉన్నారు. వాళ్లే హెన్రీ డేవిడ్​ థియరూ(అమెరికా), జాన్​ రస్కిన్(బ్రిటన్​)​, లియో టాల్​స్టాయ్(రష్యా)​, సోక్రటీస్(గ్రీస్​)​, రాల్ఫ్​ వాల్దో ఎమర్సన్(అమెరికా)​.