ఈటానగర్: సరిహద్దు ప్రజల వలసలను తగ్గిస్తామని, రాబోయే రెండేండ్లలో వారికి మెరుగైన సౌలతులు కల్పిస్తామని కేంద్ర మంత్రి నితీశ్ ప్రామాణిక్ చెప్పారు. అందుకోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పథకం వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ (వీవీపీ)ని సమర్థవంతంగా అమలు చేస్తామని తెలిపారు. దేశంలోని సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించే ఉద్దేశంతో ప్రధాని మోడీ వీవీపీని ప్రకటించారన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా నిర్వహిస్తున్న నార్త్ ఈస్ట్ ఫెస్టివల్ కోసం శనివారం ఆయన తొలిసారి అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఈటానగర్కు వచ్చారు. వీవీపీలో భాగంగా పాత కార్యక్రమాలను కొనసాగిస్తూనే కొత్త కార్యక్రమాల కోసం అదనపు నిధులను కేటాయిస్తామని చెప్పారు. ప్రజలకు ఇండ్లు కట్టిస్తామని, పర్యాటక కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, రోడ్లు వేస్తామని, సోలార్, విండ్ పవర్ వంటి పునరుత్పాదక విద్యుత్ను అందిస్తామని ఆయన చెప్పారు. దూరదర్శన్ డీటీహెచ్ సేవలతో పాటు ఎడ్యుకేషన్ చానెళ్ల ప్రసారాలను అందిస్తామని, బతుకుదెరువు కోసం మద్దతునిస్తామని పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రాలను అభివృద్ధి చేయడంతో పాటు సరిహద్దు భద్రతకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. దేశంలోని వేరే ప్రాంతాలతో ఈశాన్య రాష్ట్రాలను అనుసంధానిస్తున్నామన్నారు. భవిష్యత్లో ఈశాన్య రాష్ట్రాల రూపు రేఖలు మారిపోతాయని, రెండేండ్లలో అరుణాచల్ప్రదేశ్ కనీవినీ ఎరుగని అభివృద్ధిని సాధిస్తుందని ప్రామాణిక్ చెప్పారు. ఈశాన్య రాష్ట్రాల అవసరాలను బట్టి వీవీపీని అమలు చేస్తామని వివరించారు. దేశంలోని 200 గిరిజన తెగల అభివృద్ధికి
కేంద్రం కృషి చేస్తోందని చెప్పారు.
