న్యూఢిల్లీ: లోకల్ తయారీని పెంచడానికి కేంద్రం ఆత్మనిర్భర్ భారత్ కోసం రూ.2.3 లక్షల కోట్లు కేటాయించడం వల్ల మనదేశంలో ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ ఇండస్ట్రీకి ఎంతో మేలు జరుగుతుందని ఎక్స్పర్టులు చెబుతున్నారు. ఈ సెక్టార్ వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి 30 శాతం గ్రోత్ సాధిస్తుందని, మార్కెట్ విలువ రూ.ఏడు లక్షల కోట్లకు చేరుతుందని అంటున్నారు. గ్లోబల్ ఎలక్ట్రానిక్స్ సప్లయ్ చెయిన్లో దూసుకెళ్లడానికి ప్రభుత్వం ప్రయత్నాలు స్పీడప్ చేస్తోంది. మనదేశం నుంచి ఐటీ, వేరబుల్స్ వంటి ఎలక్ట్రానిక్స్ ఎగుమతులను 50 శాతం పెంచే లక్ష్యంతో వచ్చే ఆర్థిక సంవత్సరానికి కేంద్రం సుమారు రూ.22 వేల కోట్ల పీఎల్ఐ పథకాన్ని ప్రతిపాదించింది. ఐసియా లెక్కల ప్రకారం, 2020–-21లో దేశంలో మొబైల్ ఫోన్ల మార్కెట్ ఏకంగా రూ.2.2 లక్షల కోట్లకు చేరుకుంది. యాపిల్, ఫాక్స్కాన్, విస్ట్రన్, లావా, వివో సహా పలు కంపెనీల డేటా కూడా ఇందులో ఉంది.
ఈ ఏడాది మార్చి నాటికి ఇది రూ.2.75 లక్షల కోట్లను దాటుతుందని అంచనా. చైనా కంపెనీలు షావోమీ, బీబీకే ఎలక్ట్రానిక్స్ గ్రూప్కు చెందిన వివో, ఒప్పో, రియల్మీ, ఐకూ వంటివి స్మార్ట్ఫోన్ విభాగంలో 70 శాతం మార్కెట్ వాటాతో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిలో భారతీయ కంపెనీల వాటా తక్కువేనని ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ చైర్మన్ పంకజ్ మొహింద్రూ అన్నారు. 2016లో 47 శాతంగా ఉన్న ఈ వాటా ఇప్పుడు 8 శాతానికి పడిపోయిందని చెప్పారు. అందుకే ప్రభుత్వం ఇప్పటికే పీఎల్ఐలో చాలా మార్పులను తెచ్చిందని, ఇక నుంచి మన కంపెనీలు కూడా చాలా ఎదిగే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. చైనా కంపెనీలు ఏవీ పీఎల్ఐ స్కీముకు దరఖాస్తు చేసుకోలేదని పంకజ్ వివరించారు. ఎలక్ట్రానిక్స్ దిగుమతుల విలువ 2019-–20లో దాదాపు రూ.2.9 లక్షల కోట్లు కాగా, 2020--–21 ఇది రూ.2.85 లక్షల కోట్లకు తగ్గింది. లోకల్ తయారీ పెరగడం, ముఖ్యంగా ఎల్ఈడీ టెలివిజన్ కంపెనీల సంఖ్య పెరగడం ఇందుకు కారణం.
