10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన మహారాష్ట్ర సీఎం

10 లక్షల ఎక్స్‌గ్రేషియా  ప్రకటించిన మహారాష్ట్ర సీఎం

మధ్యప్రదేశ్‌లోని నర్మదా నదిలో ఈరోజు ఉదయం జరిగిన బస్సు ప్రమాదంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సంతాపం వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరి చొప్పున  10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో సోమవారం ఉదయం బస్సు నర్మదా నదిలో పడటంతో 13 మంది మరణించగా, పలువురు గాయపడ్డారు. మహారాష్ట్ర రోడ్‌వేస్ బస్సు ఇండోర్ నుంచి పూణెకు వెళ్తుండగా ఈ  ప్రమాదం జరిగింది. పూణే వెళ్తున్న బస్సు ధార్‌లోని బ్రిడ్జి రెయిలింగ్‌ను ఢీకొనడంతో ఖల్‌ఘాట్ సంజయ్ సేతుపై నుంచి కిందపడింది.

ఈ  బస్సులో 40 మంది ప్రయాణిస్తున్నారని, ఇప్పటివరకు 13 మృతదేహాలను వెలికి తీశామని మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా తెలిపారు. ఇప్పటి వరకు దాదాపు 15 మందిని రక్షించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటన పైన మధ్యప్రదేశ్ సీఎం శివ‌రాజ్‌సింగ్ చౌహాన్‌  మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండేకు ఫోన్ చేసి ప్రమాద స్థలంలో ప్రస్తుత పరిస్థితిని వివరించారు. దీనిపై స్పందించిన మహారాష్ట్ర సీఎం మరణించిన వారి బంధువులకు పరిహరం ప్రకటించారు.