న్యూఢిల్లీ: దేశంలో పేరొందిన పారిశ్రామిక కుటుంబాలలో ఒకటయిన గోద్రెజ్ గ్రూప్ త్వరలో విడిపోనుందని చెబుతున్నారు. రూ. 30 వేల కోట్ల వ్యాపారాలున్న ఈ గ్రూప్ సబ్బులు, హోమ్ అప్లయెన్సెస్, రియల్ ఎస్టేట్ రంగాలలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. గోద్రెజ్ గ్రూప్కు 124 ఏళ్ల హిస్టరీ ఉంది. ప్రస్తుతం ఆది గోద్రెజ్ (79) గ్రూప్కు చైర్మన్గా ఉన్నారు. గోద్రెజ్ ఇండస్ట్రీస్, గోద్రెజ్ ఆగ్రోవెట్ కంపెనీలకు ఆయన సోదరుడు నాదిర్ గోద్రెజ్చైర్మన్. వారి కజిన్ జెంషెడ్ ఎన్ గోద్రెజ్ మరో కంపెనీ గోద్రెజ్ అండ్ బాయ్స్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీకి చైర్మన్గా ఉన్నారు.
లాయర్ నుంచి ఎంట్రప్రెనూర్గా మారిన అర్దేషిర్ గోద్రెజ్ 1897లో గోద్రెజ్ గ్రూప్ నెలకొల్పారు. కొన్ని వ్యాపారాలలో ఆయన ఫెయిలయినా తాళం కప్పల (లాక్స్) వ్యాపారంతో ఆ తర్వాత సక్సెసయ్యారు. తాజా రిపోర్టుల ప్రకారం గోద్రెజ్ రెండు గ్రూప్లుగా విడిపోనుంది. ఆది, నాదిర్లు ఒక గ్రూప్గా, జెంషెడ్, స్మితా, క్రిష్నలు మరో గ్రూప్గా విడిపోనున్నారు. గత కొన్నేళ్లుగా ఫ్యామిలీ వ్యాపారాన్ని మార్చాలని ప్రయత్నిస్తున్నామని గోద్రెజ్ ఫ్యామిలీ ఒక జాయింట్ ప్రకటనలో తెలిపింది. ఇంతకు మించిన వివరాలను వేటినీ వెల్లడించలేదు. ప్రముఖ బ్యాంకర్లు నిమేష్ కంపాని, ఉదయ్ కొటక్లతోపాటు, లీగల్ నిపుణులూ కుటుంబ విభజన స్మూత్గా జరిగేలా చొరవ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. గోద్రెజ్ గ్రూప్లోని 23 శాతం ప్రమోటర్ హోల్డింగ్ ట్రస్టుల చేతిలో ఉంది.
